ఏండ్లకేండ్లు కరువుతో కొట్టుమిట్టాడి.. స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైన జనగామ, శుక్రవారం ‘ప్రగతి పండుగ’ జరుపుకొన్నది. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి జనగామలో సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడంతో పాటు జిల్లాపై వరాల వాన కురిపించగా ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని గులాబీ అధినేత ప్రారంభించగానే పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. జనగామకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని, ఈ మేరకు రెండు మూడు రోజుల్లోనే జీవో జారీ చేస్తామని, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్లో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామనే సీఎం ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అంతకుముందు జిల్లాకు వచ్చిన జననేతకు సబ్బండవర్గాలు ఘన స్వాగతం పలికాయి.
జనగామ, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : జనగామలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.54కోట్లతో కట్టిన సమీకృత కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులతో కలెక్టరేట్కు రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ చాంబర్లో పూజలు చేశారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్ జనగామ కలెక్టర్ శివలింగయ్యను ఆయన చాంబర్లో ఆసీనులను చేసి ఆశీర్వదించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో తొలి సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. కలెక్టరేట్ను నిర్మించిన బిల్డర్, ఆర్అండ్బీ ఇంజినీర్లు, నిర్మాణం కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులను సతరించారు. కలెక్టరేట్ ఒక పవిత్రమైన దేవాలయమని అభివర్ణించారు. చాలా రాష్ర్టాల్లో సచివాలయం సైతం తెలంగాణలోని జిల్లా కలెక్టరేట్ల స్థాయిలో లేవన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆఫీస్ను పరిశీలించారు. టీఆర్ఎస్ జనగా మ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డిని ఆఫీసులోని సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం జనగామ శివారు యశ్వంతాపూర్లో జరిగిన భారీ బ హిరంగ సభలో పాల్గొన్నారు. 24 నిమిషాల పాటు ప్ర సంగించారు. ఒకనాడు కరువుగడ్డగా ఉన్న జనగామ ప్రాంతం ఇప్పుడు కల్పతరువుగా మారిందని, ఇంకా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మెడికల్ కళాశాల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులకు శుభవార్త వినిపించారు. జిల్లాకు వైద్యవిద్య కళాశాల మంజూరుకు సంబంధించిన జీవో రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని ప్రకటించారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం సన్నూరు దేవస్థానం భూములను సాగుచేస్తున్న గిరిజనుల సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
దేవాదుల ప్రాజెక్టు, సమక్క బరాజ్ పూర్తయ్యాయని, దీని ద్వారా జనగామ సహా ఉమ్మడి వరంగల్ జిలాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటి నుంచి దేవాదుల ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు పరిమితం చేసి ప్రతి గ్రామం, ప్రతి చెరువుకు నీరు చేరేలా ప్రత్యేకంగా గ్రాంటు ఇస్తున్నట్లు ప్రకటించి, ఈ పనులను త్వరగా పూర్తిచేసేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఇక నుంచి జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ప్రాంతాల్లో ప్రతి ఊరికి నీరు జీవధారలా పారాలన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ను కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్ చేస్తున్నామని చెప్పారు.
‘జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేండ్ల కింద ఎకరం రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు ఉంటే, ఇప్పుడు రెండు, మూడు కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరా పొలం రూ.25లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సాధ్యమైంది. అధికారులు కూడా రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేశారు’ అంటూ అందరికీ అభినందనలు తెలిపారు.
జనగామలో ఇంత వైభవంగా కలెక్టరేట్ను ప్రారంభించుకుంటామని ఏనాడూ కలగనలేదని, యాదగిరిగుట్ట వద్ద భూములకు రేట్లు అమాంతం పెరిగిపోయాయని సీఎం చెప్పారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి ఉంది.. గ్రామీణాభివృద్ధిలో దేశంలో టాప్ టెన్లో ఏడు గ్రామాలు తెలంగాణవి ఉన్నాయి.. దీనికి పంచాయతీరాజ్శాఖ మంత్రి, అధికారుల పనితీరు అభినందనీయం.. అందరికీ సెల్యూట్ చేస్తున్నా’నని పేర్కొన్నారు.
జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్, భవనాన్ని నిర్మించిన ఈఎన్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేసి కంగ్రాట్స్ చెప్పారు. ‘అద్భుతమైన కలెక్టరేట్ కట్టింది కూడా మన తెలంగాణ బిడ్డనే. తెలంగాణకు తెలివేలేదు.. బిల్డింగ్ కట్టుకోవడానికి రానేరాదు.. పరిపాలన చేతకాదని అ న్న సమైక్యవాదులకు ఇవి చెంపపెట్టు’ అని వ్యాఖ్యానించారు. ‘జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ నమూనాను రూపొందించిన ఆర్కిటెక్ట్ ఉషారెడ్డినే. ఈమె యాదగిరిగుట్టకు చెందిన మహిళ’ అని కేసీఆర్ ప్రశంసించారు. ‘మన ఆడబిడ్డ అయినందుకు గర్విస్తున్నాం.. వెంబడి ఉండి ఈ బిల్డింగ్ను కట్టించింది కూడా మన ఈఎన్సీ గణపతిరెడ్డినే వారిది మహబూబ్నగర్.. ఆయన తెలంగాణ బిడ్డనే’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ‘అనేక మంది మన బిడ్డలే ఆర్కిటెక్టులుగా భవనాలు కట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారిని ప్రోత్సహించి అద్భుతాలు చేయిస్తున్నారు’ అని ప్రశంసించారు. ‘పవిత్రమైన దేవాలయం వంటి ఈ కలెక్టరేట్ నుంచే అనే క పనులు జరగాల్సి ఉన్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలెక్టర్ నాయకత్వంలో జిల్లా లో అద్భుతాలు ఆవిష్కరించాలి’ అని పిలుపునిచ్చారు.
జనగామ ఒక గ్రోత్ సెంటర్ అని.. ఎవరూ ఊహించని అభివృద్ధిని ఇక్కడ చూస్తామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ -వరంగల్ కారిడార్లో జనగామ కీలకమని తెల్చిచెప్పారు. ఐటీ, పరిశ్రమలు, విద్యాసంస్థలు తరలివస్తాయని, హైదరాబాద్తోపాటు మరో 32 అభివృద్ధి కేంద్రాలు తయారవుతాయని పేర్కొన్నారు. కొత్త కలెక్టరేట్లు మంచి ఫలితాలను అందించాలని, రాబోయే రోజుల్లో అభివృద్ధి అద్భుతంగా ఉంటుందని, ఇతర రాష్ర్టాలు ఆశ్చర్యపోయేలా అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు.
జనగామ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్లో అధికారుల సమీక్ష సహా బహిరంగసభలోనూ నాటి బచ్చన్నపేట పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్సార్తో కలిసి సిద్ధిపేట నుంచి వరంగల్ వెళ్తుంటే మార్గమధ్యలో బచ్చన్నపేటలో ఆగి కళ్లారా చూసిన సంఘటనను వివరించారు. ‘జనగామ ప్రాంతంలో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. బచ్చన్నపేట మండల కేంద్రంలో మాట్లాడాలంటే ఆగిన.. మాట్లాడుతుంటే చాలామంది వృద్ధులు కనిపించారు. ఎనిమిదేండ్ల నుంచి కరువు ఉంది. మంచినీళ్లు కూడా లేవు. నాలుగైదు కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. యువకులు వలస పోయిండ్రు అని చెప్తే.. నేను ఏడ్చిన’ అని గుర్తుచేసుకున్నారు. ఇలా రాష్ట్రం సాధించుకున్నామని, పట్టుబట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి అవినీతి రహితంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు.‘దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ముత్తిరెడ్డి, రాజయ్య గొడవ పెట్టుకున్నారు. కానీ పట్టుబట్టి అద్భుతంగా దేవాదుల పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం..ప్రజల అవసరాలను తీర్చడానికి నాతో యుద్ధం చేసి పనులు చేయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి’ అని వివరించారు. ‘జూలై చివరినాటికి కూడా వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి..కరువు నుంచి బయటపడ్డా’మని చెప్పారు.