దామెర, జూన్ 18: ‘ఒకప్పుడు మంచినీటి కోసం కొట్లాట.. బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచే వారు.. ఇప్పుడు పరిస్థితి వేరు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రజలందరూ మంచి మనస్సుతో మరోసారి ఆశీర్వదించాలి’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సింగరాజుపల్లిలో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్లో ఆదివారం మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్(టీఎస్ఆర్డీసీ) మెట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నీటి కోసం రాష్ట్రంలోని మహిళలు పడిన కష్టాలను గుర్తించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే పట్టుదలతో మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆరు మండలాలు, పరకాల పట్టణానికి తారునీరు అందించాలనే ధ్యేయంతో మిషన్ భగీరథ ఫిల్టర్బెడ్ 40 ఎంఎల్డీ డబ్ల్యూటీపీ ద్వారా ప్రతి గ్రామం, ఇంటింటికీ కలిపి 597 కిలో మీటర్ల పైపులైన్లు వేసి 52,036 నల్లాలు బిగించి.. తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ దేశంలోనే మన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎమ్మెల్యే చల్లా ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తుండడం చారిత్రాత్మకమని టీఎస్ఆర్డీసీ మెట్టు శ్రీనివాస్ అన్నారు. సీమాంధ్రుల పాలనలో గుక్కెడు నీటికోసం ఎన్నో ఇబ్బందులు పడిన మనం.. నేడు ఇంటి ముందుకే శుద్ధి చేసిన జలాలు వస్తున్నాయని, దీంతో మహిళలు సంబురంగా నీళ్లు పట్టుకుంటున్నారని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయడంతో భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు సాగులోకి వచ్చాయన్నారు. దీంతో రాష్ట్ర రైతాంగం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు అందించి రాష్ర్టాన్ని ప్రశంసించడమే దీనికి నిదర్శనమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫిల్టర్బెడ్లో నీటి శుద్ధీకరణను స్వయంగా పరిశీలించారు.
అనంతరం మహిళలకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటేశ్వర్రావు, ఈఈ మాణిక్యరావు, డీఈ శ్రీనివాస్, ఉత్తమ జీపీ అవార్డు గ్రహీత, సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఎంపీపీలు కాగితాల శంకర్, కళావతి, అనసూయ, మార్క సుమలత, జడ్పీటీసీలు గరిగె కల్పన, రాధిక, సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, పోలీస్ ధర్మారావు, పరకాల మున్సిపల్ కమిషనర్ శేషు, సర్పంచ్లు రజిత, విష్ణువర్ధన్రెడ్డి, గోవిందు అశోక్, రెడ్క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో కాసర్ల రవీందర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, యూత్ అధ్యక్షుడు మెంతుల రాజు, ఏపీవో శారద, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పద్మావతి, రాణి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్ పాల్గొన్నారు.