హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవెల్లి నవీన్, పల్లేర్ల వెంకటేశ్, కుర్ర దేవి తదితరులు బీఆర్ఎస్ (BRS)లో చేరారు.
శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar) సమక్షంలో చేరడంతో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పాలకుర్తికి చెందిన కాంగ్రెస్ నాయకులు సిరిపాటి ఎల్లస్వామి, సిరిపాటి మహేశ్, పాలకుర్తి ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు, వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి మాట్లాడుతూ పార్టీలో కొత్తగా చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో చేరిన వారు గ్రామ అభివృద్ధికి (Development), వచ్చే ఎన్నికల్లో (Elections) పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.