స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, అఖిల భారత సస్యరక్షణ విభాగం హైద్రాబాద్ వారు పంటలకు క్రిమి సంహారక మందుల వాడకం, వాటి అవశేషాలు తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించారు. పంటల తెగుళ్ల నివారణకు రైతులు పిచికారీ చేసే క్రిమి సంహారక మందులలో 95శాతం భూమిలో కలిసిపోతుందన్నారు. దీని ద్వారా ప్రజలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
పురుగుమందుల షాపుల సూచనలు కాకుండా వ్యవసాయాధికారుల సూచన మేరకు అవసరమైన సమయంలో, అవసరమైనంత వరకు పంటలకు క్రిమి సంహారక మందులు వాడాలన్నారు. ఫెర్టిలైజర్ షాపులలో కొనే విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ వాటి రసీదులు తప్పని సరిగా తీసుకుని వాటిని జాగ్రత్త పరచాలన్నారు. పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటేనే క్రిమి సంహారక మందులు వాడాలని, అనవసరంగా వాడి రైతులు నష్టపోకూడదని సూచించారు.
సమావేశం అనంతరం ఐసిఆర్ ఢిల్లీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 107 మంది దళిత రైతులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డా. శ్రీధేవి, డా. అనిల్ కుమార్, డా. కవిత, డా. శివ కుమార్, గ్రామ అభ్యుదయ రైతు వెంకట్ రెడ్డి, థామస్, రైతులు జోగు కుమార్, యాకయ్య, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.