జనగామ చౌరస్తా, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో జనగామ జిల్లా 98.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించింది. జిల్లావ్యాప్తంగా 6,692 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 3,076 మంది బాలురు, 3,493 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 97.59 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 98.67 నమోదైంది. జిల్లాలోని 182 ఉన్నత పాఠశాలల్లో 4 బీసీ వెల్ఫేర్ పరిధిలో ఉన్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, రెండు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఐదు జడ్పీహెచ్ఎస్తో పాటు 19 ప్రైవేట్ పాఠశాలలతో కలిపి మొత్తం 35 స్కూళ్లలో 133మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 108 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలదే పైచేయిగా నిలిచింది. గతేడాది వెలువడిన ఫలితాల్లో జిల్లా పదో స్థానంలో నిలువగా, ఈసారి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ టాప్గా నిలిచి విద్యారంగ నిపుణుల ప్రశంసలు అందుకుంది. కాగా, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు డీఈవో రాము శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 95.99శాతం ఉతీర్ణతతో హనుమకొండ జిల్లా 10వ స్థానం, 94.60 శాతంతో మహబూబాబాద్ 12వ స్థానం, 94.45శాతంతో ములుగు 13వ స్థానం, 92.96శాతంతో భూపాలపల్లి 16వ స్థానం, 92.20 శాతంతో వరంగల్ 22వ స్థానానికి పరిమితమైంది.