జనగామ రూరల్, జూలై 25 : గ్రామాల్లో సీజనల్, అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, అతిసార వ్యాధులు విజృంభించకుండా వైద్య సిబ్బంది, మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను శివలింగయ్య తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ, మలేరియా లక్షణాలుంటే వారికి వైద్య పరీక్షలు చేయించి, సమీపంలోని ఏరియా ఆసుపత్రిలో చేర్చాలన్నారు. అవసరమైతే వెంటనే వైద్యం అందించాలని కోరారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్యం మెరుగు పరుస్తున్నామని శివలింగయ్య తెలిపారు. దోమలు విజృంభించకుండా ప్రతి శుక్రవారం, ఆదివారం డ్రైడేను నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా నివారణకు అర్హులందరికీ బూస్టర్ డోస్ తీసుకునేలా వైద్య సిబ్బంది ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త్తున్నారని గ్రామాల్లో మురుగునీటి కాల్వల్లో పూడిక ఉంటే తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తాగునీటి ట్యాంకుల పైపులైన్లు లీకేజీలుంటే వెంటనే మరమ్మతు చేపడుతున్నామని పేర్కొన్నారు. ట్యాంకులను పరిశుభ్రపరుస్తూ తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇంటింటికీ చెత్త సేకరణకు పంచాయతీ సిబ్బంది వెళ్లినప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నామని తెలిపారు. హోటల్స్, కిరాణాలతో పాటు మార్కెట్లలో మటన్, చికెన్ షాపుల వద్ద కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పరిశుభ్రత పాటించకుంటే జరిమానా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలకనుగుణంగా హోటళ్లు, దుకాణాల్లో పరిశుభ్రత పాటించకపోతే యజమానులకు జరిమానా విధించాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడీ, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏపూరి భాస్కర్ రావు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, వైద్యాధికారి మహేందర్ పాల్గొన్నారు.