నర్సింహులపేట, జూన్ 24 : వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నది.. మృగశిర కార్తెలో కొద్దిగా చినుకులు కురిసినప్పటికీ రైతుల ఆశలు మాత్రం అడియాశలయ్యాయి. వరణుడు కరుణించక.. ఎవుసం మొదలుకాక అన్నదాత కుదేలవుతున్నాడు. గట్టివాన లేక.. చెరువుల్లోకి నీరు చేరక ఇబ్బందులు పడుతున్నాడు. మబ్బులు మురిపిస్తున్నా.. చినుకులు పడకపోవడంతో ఇంకా నాగలి పట్టే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలు కురస్తాయనే ఆశతో బావులు, బోర్ల కింద రోహిణి కార్తెలో పోసిన వరినార్లు పలుచోట్ల ఎండిపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ముదురుతున్నాయి. పొలం దున్నేందుకు సరిపడా నీరులేక సాగు మొదలు పెట్టేందుకు రైతులు జంకుతున్నారు.
చిన్న చినుకులకే పత్తితో పాటు పెసర, కంది విత్తనాలు వేయగా అవి భూమిలోనే మాడిపోతున్నాయి. అక్కడక్కడా మొలకెత్తిన పత్తిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఆరుద్రలోనైనా వర్షాలు కురవాలని, లేకపోతే వరుసగా 6 కార్తెలు అంటే సుమారు 90 రోజుల వరకు వర్షాలు పడవని రైతులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ నెలలో ఇప్పటి వరకు సగటున 14 సెంటీమీటర్ల వర్షపాతానికి కేవలం 5 సెంటీమీటర్లు మాత్రమే కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో పది రోజుల వరకు వర్షాలు పడకుంటే నార్లు ఎత్తిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.

జూన్ 5 సెంటీమీటర్ల వర్షపాతం..
ఈ నెలతో పాటు జూలైలో వర్షాలు కురవకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో నారుమళ్లు తడిపేందుకు, పత్తిని కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వాప్తంగా గత ఏడాది కంటే చాలా తక్కువ వర్షం కురిసిందని, జూలై రెండో వారం వరకు వాన పడకపోతే విత్తనాలు వేసే అవకాశం ఉండదని రైతులు వాపోతున్నారు. భారీ వర్షం కురిస్తే తప్ప పొలాలను సాగుకు సన్నద్ధం చేసే పరిస్థితి లేదంటున్నారు. గత ఏడాది ఈ సమయానికే అన్ని పంటలు వేశామని, ఈసారి వరి, మక్కజొన్న సాగు చేసేందుకు కూడా ఇబ్బందిపడుతున్నామంటున్నా రు. జూలైలో వానలు సమృద్ధిగా పడకుంటే ఇప్పటికే నారు పో సుకున్న రైతులు, దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు నష్టపోతారని అధికారులు చెబుతున్నారు.
పెసర మొలకెత్తలేదు..
నాకున్న 11 ఎకరాల్లో పెసర పంట వేసిన. వర్షాలు లేకపోవడంతో అక్కడక్కడా మొలుకలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో పూర్తిగా మొలుకలు రాలేదు. ఎప్పుడూ లేనంతగా ఎండ తీవ్రత ఉండడంతో వచ్చిన మొలకలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వానలు పడకపోతే పూర్తిగా నష్టపోవుడే..
– పాతూరి వెంకట్రెడ్డి, రైతు, పడమటిగూడెం