మహబూబాబాద్ రూరల్/బయ్యారం/దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 21 : మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి కిందపడ్డాయి. మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామంలోని బీసీ కాలనీలోఐదు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బలంగా వీచిన గాలికి పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
బయ్యారంలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. ఏజెన్సీ ప్రాంతంలో వరి, మక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇటుక బట్టీల్లో ఇటుకలు తడిసిపోయాయి. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కూలిపడగా మామిడికాయలు రాలిపోయాయి. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డిగూడెంలో పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.