‘వరంగల్కు గొప్ప చారిత్రక వారసత్వమే కాదు ఉజ్వల భవిష్యత్తు ఉన్నది.. వరంగల్ నగరాన్ని తెలంగాణకు మణిమకుటంలా మార్చుకుందా’మని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కార్యకర్తల బహిరంగసభలో రామన్న ప్రసంగించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యమ నాయకుడు దాస్యం వినయ్భాస్కర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రూ.181.45కోట్లతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నదని, కవులు, కళాకారులు, మేధావులు ఉన్న చైతన్యవంతమైన ఓరుగల్లు అన్ని రంగాల్లో వేగంగా ముందుకు పోతుందని ఆకాంక్షించారు.
వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కార్యకర్తల బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలోనే అతిపెద్ద గవర్నమెంట్ దవాఖాన వరంగల్లోనే నిర్మాణమవుతున్నదని చెప్పారు. రూ.1116కోట్లతో 24 అంతస్తులతో హెల్త్ సిటీ బ్రహాండంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలకే కాకుండా చుట్టుపక్కల 12 జిల్లాలకు ఇది కల్పతరువుగా మారబోతున్నదని వెల్లడించారు. పేదలకు మంచి వైద్యం అందించాలని, వరంగల్లో హెల్త్ సిటీ కట్టాలనే ఆలోచన ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రులకు, గత ప్రభుత్వాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ‘వరంగల్కు కొత్తగా నాలుగు ఐటీ కంపెనీలు వచ్చాయి.
జెన్ ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్, హెక్సాడ్, ఎల్అండ్టీ-మైండ్ ట్రీ ఇతర కంపెనీలు వస్తున్నాయి. వరంగల్లో ఐటీ రంగంలో రెండు వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ టెక్ మహీంద్ర, సైయంట్, సాఫ్ట్పాత్ ఐటీ కంపెనీలు ఉన్నాయి. బొంబాయికి పూణె, బెంగళూరుకు మైసూరు తరహాలో హైదరాబాద్కు వరంగల్ అభివృద్ధి చెందుతున్నది. వరంగల్ నగరంలో రూ.645 కోట్లతో మిషన్ భగీరథ చేపట్టాం. 1116 కోట్లతో హెల్త్ సిటీ. రూ.148 కోట్లలో రెండు జిల్లాల్లో కలెక్టరేట్లు, రూ.85 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం కడుతున్నం. సెప్టెంబరులోపు దీన్ని పూర్తి చేసి కానుకగా అందిస్తం. కేంద్రం స్పందించకపోతే 163 నేషనల్ హైవేపై రూ.75 కోట్లతో ఆర్వోబీ , రూ.68 కోట్లతో ఫాతిమా వద్ద మరో ఆర్వోబీ కడుతున్నాం. రూ.70 కోట్లతో నాలాలు బలోపేతం చేశాం. రూ.75 కోట్లతో కొత్త బస్టాండ్లు నిర్మించుకుంటున్నం. ఈరోజే ఆదేశాలు ఇచ్చినం. రూ.50కోట్లతో ఇన్నర్ రింగురోడ్డు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. త్వరలోనే పూర్తి చేస్తం. రూ.28కోట్లతో కొత్తగా 22 పార్కులు అభివృద్ధి చేసినం. రూ.30కోట్లతో భద్రకాళీ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నం. రూ.20 కోట్లతో మినీ స్టేడియం, రూ.6 కోట్లతో బలహీనవర్గాలకు కమ్యూనిటీ హాళ్లు. రూ4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్వెజ్ మార్కెట్, రూ.10.50 కోట్లతో వైకుంఠధామాలు, రూ.3 కోట్లతో ఆధునాతన దోభీఘాట్లు, కోటి రూపాయలతో లైబ్రరీ.. ఇంకా ఎన్నో ఉన్నాయి’ అని కేటీఆర్ వివరించారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యమ నాయకుడు దాస్యం వినయభాస్కర్ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత వినయ్భాస్కర్ బాధ్యతలు మరింత పెరిగాయని, నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎప్పటిలాగే ఆయనను ఆశీర్వదించాలన్నారు. ‘అందరికీ ఆప్తుడు, ఏ సమయంలో అయినా, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మీ అందరికీ, మా అందరికీ నేనున్నా అంటూ టక్కున పలకరించే నాయకుడు, మాస్ లీడర్, ఉద్యమనాయకుడు, ప్రభుత్వ చీఫ్విప్ వినయభాస్కర్. హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వినయ్భాస్కర్కు అభినందనలు. హనుమకొండ నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఉద్యమంలో ముందున్న నియోజకవర్గం. ఎంతోమంది మేధావులు, చైతన్యవంతులు, యువకులు ఉన్న ఈ సెగ్మెంట్లో ఎంతో మంది రాజకీయ అతిరథమహారథులు ఉన్నరు. అందరు కార్యకర్తలకు ఒక మాట చెప్పాలి. ఎన్నికల సమయంలో నన్ను ఈ నియోజకవర్గానికి పరిమితం చేయకుండా జిల్లా మొత్తం తిరిగేలా అవకాశం ఇవ్వాలని వినయ్భాస్కర్ కోరారు. వారు అన్నట్లుగా ఇక్కడి ప్రజలు ఆ అవకాశం ఇవ్వాలి. జిల్లా అధ్యుడిగా వినయ్భాస్కర్ కమలాపూర్లో తిరిగినా, వర్ధన్నపేటలో తిరిగినా మీరు గెలిపించుకుంటారని నాకు విశ్వాసం ఉన్నది. గత ఎన్నికల్లో వినయ్భాస్కర్కు 37వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో రెట్టింపు అంటే 70 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకోవాలి. ఒక మాస్ లీడర్గా, ఎప్పుడు పిలిచినా పలికే సోదరుడిగా, 30 ఏండ్లపాటు మీలో ఒకడిగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి పక్క జిల్లాకు అయినా, రాష్ర్టానికి అయినా వెళ్లే నాయకుడు. వినయభాస్కర్కు బాధ్యత పెరిగింది కాబట్టి ఆయనను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. వినయ్భాస్కర్కు అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హనుమకొండ చౌరస్తా, మే 5 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.