గిర్మాజీపేట, జూన్ 17: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశోధన అంశాలపై ఆసక్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టి సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. తక్కువ వ్యయంతో (రూ. 200) ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు రూపొందిచడం సైన్స్ హ్యాకథాన్ కార్యక్రమ ఉద్దేశం. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర విద్యాశాఖ ‘డు ఇట్ యువర్ సెల్ఫ్-సైన్స్ హ్యాకథాన్’ కార్యక్రమం కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ వరకు అప్లోడ్ చేయాలి. ప్రైవేట్ పాఠశాలలు మినహా ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులని విద్యాశాఖ పేర్కొంది.
శాస్త్రీయ విషయాలపై అవగాహన కలిగి ఉండి ఆసక్తి కలవారందరికీ అవకాశం ఉంది.
ఒక విద్యార్థి లేదా బృందం గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్ర్తానికి సంబంధించిన ఆవిష్కరణ, దాని పనితీరుపై రెండు నిమిషాల నిడివికి మించకుండా వీడియోను రూపొందించాలి. ఇందులో ఉపయోగించే పరికరాలు ఉచితంగా లేదా రూ. 200లోపు ఖర్చు కలిగి ఉండాలనే నిబంధన ఉంది.
విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి రూపొందించిన ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను ఈ నెల 20వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు https://schooledu.telangana.gov. in వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ వీడియో లింక్లో పొందుపరచాలన్నారు. దీనిపై ఇప్పటికే అన్ని పాఠశాలలకు విద్యాశాఖాధికారులు సమాచారం ఇచ్చారు. ఇందులో ఉత్తమంగా నిలిచిన వీడియోలకు బహుమతులు, ధ్రువపత్రాలను ప్రభుత్వపరంగా అందజేయనున్నారు.
ఒక్కో ఆవిష్కరణకు 100 మార్కులు కేటాయించారు. వాటిల్లో కిట్ తయారీకి 30 మార్కులు, నూతనంగా ఎంచుకున్న అంశానికి 30, అంశానికి 30, అంశాన్ని వివరించే తీరుకు 10 మార్కులు కేటాయించనున్నారు. దీనిపై శుక్రవారం (జూన్16న) టీ-శాట్ ద్వారా అన్ని పాఠశాలలకు అవగాహన కల్పిస్తారు.
అన్ని పాఠశాలలు పాల్గొనాలి
రాష్ట్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న సైన్స్ హ్యాకథాన్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలకు ప్రోత్సాహంగా నిలవనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. తక్కువ ఖర్చుతో పాఠశాలలో అందుబాటులోని మెటీరియల్తోనే ఆవిష్కరణలు తయారు చేసుకునేలా సూచనలు జారీ చేశాం. అన్ని పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని విద్యార్థుల ప్రాతినిథ్యాన్ని పెంచాలి.
– జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్