జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రికి రాత్రే బియ్యం మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రేగొండ మండలానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి డీసీఎం వాహ నంలో రేషన్ బియ్యాన్ని ఛత్తీస్గఢ్కు అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొంత మంది యువకులు కారులో డీసీఎం వాహనాన్ని వెంబడించి భూపాలపల్లి పట్టణంలో అడ్డుకున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న వ్యక్తులను చితకబాది వారి సెల్ఫోన్లు లాక్కున్నట్లు సమాచారం.
అనంతరం పోలీసులు బియ్యంతో ఉన్న డీసీఎం వాహనాన్ని వదిలేసినట్లు తెలిసింది. అయితే ఆ బియ్యం వ్యాపారి ఎవరు?, ఎవరి పైరవీతో బియ్యం వాహనాన్ని పోలీసులు వదిలేశారనే విషయం భూపాలపల్లిలో హాట్ టాఫిక్గా మారింది. ఇటీవలే బాంబులగడ్డ వద్ద ఒక ఇంట్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు పట్టుబడిన బియ్యం వాహనాన్ని ఎందుకు వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డీఎస్పీ రాములును వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, విచారణ జరుపుతానని అన్నారు.