హనుమకొండ చౌరస్తా, జూన్ 29 : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్మన్, కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. మొత్తం 75,925 మంది అభ్యర్థులు ఐప్లె చేయగా, 70,900 మంది పరీక్ష రాశారని, వారిలో 61,092 మంది (86.17శాతం) అర్హత సాధించినట్లు చెప్పారు. అర్హత సాధించిన వారిలో పురుషులు 29,618మంది, మహిళలు 31,473 మంది, ట్రాన్స్జెండర్ ఒకరు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు convenor.icet@tsche. ac.inలో సంప్రదించాలని చెప్పారు. ఉన్నత విద్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. అకడమిక్ ఇయర్ విద్యార్థులకు ఆలస్యం కాకుండా పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చే నెలలో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఎస్ నరసింహాచారి, పీ అమరవేణి, ఎన్ వాసుదేవారెడ్డి, వై వెంకయ్య, పీ కృష్ణమాచారి, డాక్టర్ ఎం సత్యవతి పాల్గొన్నారు.
మొదటి 20 ర్యాంకులు సాధించింది వీరే..
ఐసెట్ మొదటి 20 ర్యాంకులను లింబాద్రి వెల్లడించారు. వీరిలో సూర్యాపేట హుజూర్నగర్కు చెందిన నూకల శరణ్కుమార్(మొదటి ర్యాంకు), హైదరాబాద్ కంచన్బాగ్కు చెందిన నాగులపల్లి సాయినవీన్(2వ ర్యాంకు), హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన రవితేజ సజ్జ(3వ ర్యాంకు), మల్కాజ్గిరి, నేరేడ్మెట్కు చెందిన ఎస్ సాయిఫణి ధనుశ్(4వ ర్యాంకు), సూర్యాపేట నేరేడుచర్లకు చెందిన మల్లికంటి గోపి(5వ ర్యాంకు), నల్గొండ అల్కపురికి చెందిన తిరుగుడు సుమత్కుమార్రెడ్డి(6వ ర్యాంకు), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆయచిటుల నితీశ్కుమార్(7వ ర్యాంకు), మేడ్చల్ బొల్లారానికి చెందిన వేదాంతం సాయివెంకట కార్తీక్(8వ ర్యాంకు), గుంటూరు దుగ్గిరాలకు చెందిన నాగసాయి కృష్ణవంశీ(9వ ర్యాంకు), మంచిర్యాల గోదావరికాలనీకి చెందిన బైరి సాయిగణేశ్(10వ ర్యాంకు) సాధించారు. ఏలూరుకు చెందిన కొమరపు భానుప్రసన్న(11వ ర్యాంకు), సూర్యాపేటకు చెందిన ఇరువంటి సంతోష్కుమార్(12 వ ర్యాంకు), కాకినాడకు చెందిన నందిపాటి వీరస్వామి(13వ ర్యాంకు), హుజూర్నగర్కు చెందిన ఉప్పల కౌశిక(14వ ర్యాంకు), మల్కాజ్గిరికి చెందిన మండవ హనీశ్సత్య(15వ ర్యాంకు), హైదరాబాద్కు చెందిన మామిడి హన్వీరెడ్డి(16వ ర్యాంకు), మల్కాజ్గిరికి చెందిన రాంపల్లి ఈశ్వర అశోక్(17వ ర్యాంకు), మేడిపల్లికి చెందిన రావూరు ఆశిశ్అభినవ్(18వ ర్యాంకు), భద్రాద్రి కొత్తగూడెం కరకగూడేనికి చెందిన పోగు విశ్వతేజ(19వ ర్యాంకు), ముషీరాబాద్కు చెందిన నూతన్కుమార్(20వ ర్యాంకు) సాధించారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.