Allu Sirish | ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తాను ప్రేమించిన నయనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ కనిపిస్తోంది. సినిమాల కంటే ప్రస్తుతం కుటుంబ జీవితానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్న శిరీష్, తాజాగా తన భార్యలోని ఓ ప్రత్యేకమైన ప్రతిభను అభిమానులకు పరిచయం చేశారు.పెళ్లి అనంతరం నయనిక రెడ్డి సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమయ్యారు. ఆమె హావభావాలు, లుక్ గురించి కొందరు ట్రోల్స్ చేసినా, వాటిని అల్లు శిరీష్ ఎంతో హుందాగా స్వీకరిస్తూ సానుకూలంగా స్పందించారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమంలో నయనిక రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో భజనలు, ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ కనిపించారు. పసుపు రంగు చీరలో సంప్రదాయబద్ధంగా కనిపించిన నయనిక తన గాత్రంతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వెనుక అత్తగారు నిర్మల, తోటికోడలు స్నేహ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో పాటు కుటుంబ సభ్యులు భక్తి భావంతో కార్యక్రమంలో పాల్గొనడం ఫోటోలో కనిపించింది. ఈ ఫోటోను పంచుకున్న అల్లు శిరీష్.. “ఆమెలో ఈ కోణం కూడా ఉందా!” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నయనికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “అల్లు కుటుంబ కోడలిలో ఇంత మంచి గాత్రం కూడా ఉందని తెలియదు”, “సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది”, “అల్లు కుటుంబానికి తగ్గ కోడలు” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి తర్వాత నయనిక రెడ్డి మరో కొత్త కోణాన్ని అభిమానులకు పరిచయం చేయగా, ఆమె ప్రతిభకు అల్లు శిరీష్ ఇచ్చిన ప్రశంసలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అభిమానులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అన్యోన్యతను ప్రశంసిస్తున్నారు.