వరంగల్ చౌరస్తా/ఖిలావరంగల్, ఆగస్టు 14 : వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగాయి. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో గ్రౌండ్ స్థలాన్ని చదును చేయడం పూర్తికావడంతో సోమవారం వేదిక నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం తాగునీటి ఏర్పాట్లుకు చర్యలు చేపట్టారు. పరేడ్, బందోబస్తు, బారికెడ్ల నిర్మాణంతోపాటు గౌరవ వందనం నిర్వహించడానికి పోలీస్ శాఖ అధికారులు మార్కింగ్ చేసి పనులు మొదలుపెట్టారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యఅతిథులు, అధికారుల వాహనాల పార్కింగ్తో పాటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 108, 102 వాహనాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్తో మెడికల్ టీం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు సైతం ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేయడానికి, స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతల కోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటుకు వీలుగా పాండాలను ఏర్పాటు చేశారు. కాగా, వరంగల్ జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలో మంగళవారం జరుగనున్న పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హాజరు కానున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్/సుబేదారి : స్వాతంత్య్ర వేడుకలకు హనుమకొండ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ను ముస్తాబు చేశారు. పోలీస్ పరేడ్తో పాటు వివిధ శాఖల శకటాల ప్రదర్శనకు గ్రౌండ్ను సిద్ధం చేశారు. వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు అయన జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తారు. కాగా, పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సోమవారం వారు గ్రౌండ్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకలకు వచ్చే వీఐపీలు, అవార్డు గ్రహీతలు, విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతీయ జెండా రంగులతో సభా వేదిక, గ్యాలరీలను ఏర్పాటు చేసిట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.