కమలాపూర్, జనవరి 19 : బీఆర్ఎస్ నాయకులను అణగదొక్కేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభించేందుకు ఆయ న వెళ్లగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి లేకుండా ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ పోలీస్ సిబ్బందితో గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో ఏసీపీ డేవిడ్రాజ్, తహసీల్దార్ మాధవి మాట్లాడారు. కాగా, బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి మంత్రి సమయం తీసుకున్నాకే ప్రారంభించాలని ఎమ్మెల్యేకు సూచించారు. కాగా, కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి, కలెక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదని కౌశిక్రెడ్డి చెప్పారు. ఈ నెల 31న సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నదని, 24 వరకు అధికారులు ప్రొటోకాల్ ప్రకారం మంత్రి కి సమాచారం ఇవ్వాలని, లేకుంటే తామే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎమ్మెల్యే విమర్శించారు. నూతన పంచాయతీ భవనాల ప్రారంభానికి కాంగ్రెస్ మంత్రులు, నాయకులు వస్తే తనకేలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు కావాలనే కల్యాణలక్ష్మీ చెక్కులను జమ్మికుంట తహసీల్దార్ ద్వారా లబ్ధిదారులకు ఇప్పించారని, తహసీల్దార్ రూ.10వేలు లంచం తీసుకుని వాటిని పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి నెల రోజులైనా పట్టించుకోవడం లేదన్నారు. ఆ డబ్బులో మంత్రులకు ఏమైనా వాటా ఉందో? చర్యలు తీసుకోకుండా కలెక్టర్పై ఒత్తిడి చేస్తున్నారో? తెలియడం లేదన్నారు. కమలాపూర్ మండలంలోని డీబీఎం 24 కాల్వకు నీళ్లు ఇవ్వడం లేదని, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సాగు నీళ్లు ఇవ్వాలని లేదంటే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రైతుబంధు డబ్బులను వెంటనే ఖాతాల్లో వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్లూరి రాంచందర్రావు, జడ్పీటీసీ లాండిగ కల్యాణి, ఎంపీటీసీ భాస్కర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, నాయకులు తిరుపతిరావు, లక్ష్మణ్రావు, శ్రీకాంత్, నవీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.