వరంగల్చౌరస్తా, మార్చి 20: ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు. అలాగే, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎంజీఎం హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో క్షతగాత్రుల ఎముకల స్థితిని తెలుసుకునేందుకు ఎక్స్రే అవసరం ఉంటుంది. అయితే, నాలుగు రోజుల నుంచి ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదు. దీంతో క్షతగాత్రులు, అటెండెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం ఎక్స్రే మిషన్ మొరాయించింది.
అప్పటినుంచి ఎమర్జెన్సీ వార్డులో సేవలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో చికిత్స పొందుతున్న రోగిని సైతం స్ట్రెచర్పై రేడియాలజీ విభాగానికి తరలించాల్సి వస్తున్నా అధికారులు మరమ్మతుల విషయంపై స్పందించడం లేదని అటెండెంట్లు వాపోతున్నారు. అత్యవసర విభాగంలో ఎక్స్రే అందుబాటులో లేకపోవడంతో వైద్యసిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అలాగే, రేడియాలజీ విభాగానికి తరలించే క్రమంలో అంతర్గత రోడ్లు సరిగా లేక క్షతగాత్రులు తీవ్ర నొప్పిని భరించాల్సి వస్తున్నదని వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్షించారు. అయినా అందుకు తగిన విధంగా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.