ఈ ఎన్నికల సీజన్లోనైనా గ్యాస్ ధర దిగిరాకపోతుందా? అని ఎదురుచూసిన ప్రజలపై మోదీ సర్కారు మళ్లీ ‘బండ’మోపింది. గృహ వినియోగ సిలిండర్ ధర మరో రూ.50, వాణిజ్య సిలిండర్ ధర మరో రూ.350 పెంచి అటు వంటింట్లో.. ఇటు చిరువ్యాపారాల్లో మంట పెట్టింది. ఇప్పటికే సబ్సిడీకి మంగళం పాడిన బీజేపీ ప్రభుత్వం, మాటిమాటికీ గ్యాస్ ధర పెంచుకుంటూ పోతుండడంపై సామాన్యుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. మోదీ సర్కారు రాక ముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈ ఎనిమిదేళ్లలో రూ.1200కు చేరువ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే చాలా మంది గ్యాస్ పొయ్యిలను అటకెక్కించి కట్టెలపొయ్యిపైనే వంట చేసుకుంటుండగా కేంద్ర సర్కారు తీరుతో మంచిరోజులు వస్తాయనుకుంటే దినదినగండంగా మారుతున్నదని పేదల్లో ఆవేదన కనిపిస్తున్నది.
‘మంచిరోజులు వస్తయంటే ఏందో అనుకున్నం.. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదోళ్లను ముంచే రోజులు వచ్చినయ్.. మోడీ మా కష్టాలు తీరుస్తడనుకుంటే.. మొత్తం బతుకునే భారం చేస్తున్నడు’ అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటిమాటికీ పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు తమ జీవితాలపై భారం మోపుతున్నాయని వాపోతున్నారు. కూలినాలి చేసుకొని బతికే తమకు రూ.1200 దాకా పెట్టి సిలిండర్ కొనే స్థోమత ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి గృహ వినియోగ సిలిండర్ ధర మరో రూ.50, వాణిజ్య సిలిండర్ ధర మరో రూ.350 పెరగడంపై మండిపడుతున్నారు. బీజేపీ సర్కారు రాక ముందు రూ.400 ఉన్న ధర ఇప్పుడు రూ.1200కు చేరిందని, అంత ధర పెట్టలేక కట్టెలపొయ్యిపైనే నానా తిప్పలు పడుకుంటూ వంట చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఇకనైనా ధరలు తగ్గించకుంటే కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించుతామని స్పష్టం చేస్తున్నారు.
హనుమకొండ, మార్చి 1 : గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. నిత్యావసరమైన గ్యాస్ ధరను పెంచడం సరికాదన్నారు. కేంద్రం అన్ని ధరలూ పెంచి ఒకరిద్దరిని పోషిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న నియోజకవర్గ కేంద్రాల్లో, 3న మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వంట గ్యాస్ ధరను కేంద్ర సర్కారు మునుపెన్నడు లేనంత పెంచింది. మేము రోజు కూలీగా చేసుకునేటోళ్లం.. మాలాంటోళ్లు ఇంతింత ధర పెట్టి గ్యాస్ బండ కొనుక్కునుడంటే చాన ఇబ్బంది. ఉప్పు, పప్పు సహా ఏ పూటకాపూట కొనుక్కచ్చుకుంటం. బీజేపీ సర్కారు పుణ్యమా అని గ్యాస్ పొయ్యిమీద వంట వండే రోజులు పోయినయ్. కట్టెలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నం. మోదీ మాలాంటోళ్ల కష్టాలు తీరుస్తడనుకుంటే అసలు బతుకుడే భారం చేస్తున్నడు.. బీజేపీని ఓడగొడితెనే గ్యాస్ ధర తగ్గుతది కావచ్చు.
– జాడి నాగమణి, నిమ్మగూడెం, మహాముత్తారం మండలం,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కొడకండ్ల : మంచిరోజులు వస్తయంటే ఏందో అనుకున్న.. కేంద్ర సర్కారు పుణ్యమా అని మాకు మళ్లా కట్టెల పొయ్యే దిక్కయ్యింది. మొదట్ల గ్యాస్ వాడుర్రి, కట్టెల పొయ్యితోటి కండ్లు పోతయని చెప్పిర్రు. పైసలు లేకుంటె ఉట్టిగనే ఇచ్చినట్లు చేశిర్రు. ఇప్పుడు పైసలు ఎక్కువ పెంచి మళ్లా కట్టెల పొయ్యే దిక్కయ్యేటట్టు చేశిర్రు. సబ్సిడీ పైసలు బ్యాంకుల పడుతయని చెప్పిర్రు. అయ్యి అసలే పడుతలేవు. ఇన్నేండ్లల్ల గీ తీరుగ రేట్లు ఎన్నడు పెరుగలేదు. మేము కల్లు అమ్మితే వచ్చే పైసలతోనే మా ఇల్లు గడుసుడు కష్టమైతాంది. ఇగ గంత గంత రేటు పెట్టి గ్యాస్ మొద్దు కొనుడు మాతోని అయితదా? మళ్ల ఎన్కటి రోజులే వచ్చినయ్. దేశం బాగుపడుతది అనుకుంటె ఆగం చేస్తార్రు కదా?
– చిత్తలూరి యాదమ్మ, నర్సింగాపురం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లా
వర్ధన్నపేట : నేను కర్రీ పాయింట్ నడుపుత. గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పటికే పెరిగిన ధరతో చాలా ఇబ్బంది పడుతున్నం. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధర రూ.2,020కి చేరింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో రూ.350 పెంచి చిరువ్యాపారులను ఆగం చేసింది. ఎంతో కష్టపడి స్వయం ఉపాధి పొందుతున్న మా లాంటి వాళ్లు ఇంత ధర పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏం మిగులుతది? కేంద్రం ధరలు పెంచుకుంట పోయినట్లు మేం కూడా వంటకాలకు ధరలు పెంచి అమ్మలేం కదా? కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పొందుతున్న మాలాంటి వాళ్ల పొట్టమీద కొడుతున్నది. ఇది ఇట్లనే కొనసాగితే బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పుడు ఖాయం.
-బోయిని కుమారస్వామి, ఇల్లంద, వర్ధన్నపేట మండలం, వరంగల్ జిల్లా
నడికూడ : బీజేపీ సర్కారు వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ ధరలు పెరుగుతనే ఉన్నయి. మొదట్ల సబ్సిడీ వచ్చేది. ఇపుడు అది కూడా వచ్చుడు లేదు. 400 నుంచి 1200 రూపాయలకు పెంచిన్రు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సామాన్యులకు శాపంగా మారాయి. కనీస అవసరాలు, వస్తువుల ధరలు పెంచుకుంట పోతే దేశంలో పేదరికం మరింత పెరుగుతుంది కదా.. ఈ మాత్రం కూడా నాయకులకు తెలియకపోవడం దురదృష్టకరం. ఇలాంటి నిర్ణయాలు మాలాంటి మధ్యతరగతి జీవితాలను చీకటి లోకి నెట్టినట్టే అవుతుంది. ఇలా అయితే బతికేదెట్ల.
– బైరి సుమలత, గృహిణి, నడికూడ
కృష్ణకాలనీ : మోదీ సర్కారు గ్యాస్ ధరలు పెంచుకుంట పోతాంది. ఇప్పుడు గంత ధర పెట్టి నింపించుకుందామంటే పైసల్ లేవు. కేంద్రంలో బీజేపీ అచ్చినంక గ్యాస్ ధరలు మస్తు పెరుగుతానయ్. తగ్గుడన్న ముచ్చటనే లేదు. గ్యాసోళ్ల దగ్గరికి పోయి గ్యాస్మొద్దు ధర అడిగితే రూ.1200 అన్నడు. నా దగ్గర గన్ని పైసల్ లేక ఇగ నింపించుకుంట లేను. మాది చాలా నిరుపేద కుటుంబం. పూట గడవడమే కష్టంగా ఉంటది. ఈ కేంద్రపోళ్లు పేదోళ్ల గురించి కొంచెం ఆలోచించాలె. కట్టెల పొయ్యిమీదనే వండుకుంటన్నం. ఇప్పటికైనా ప్రధానమంత్రి గ్యాస్ ధరలు తక్కువ చేయాలె.
– బోడికల సమ్మక్క, కాశీంపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ములుగు, నమస్తే తెలంగాణ : గ్యాస్మొద్దు ధర రోజురోజుకు ఈ తీరుగా పెంచుకుంట పోతే మా అసొంటి కూలి పని చేసుకునేటోళ్లు ఎట్ల బతకాలె. గన్ని పైసల్ వెట్టి కొనుడు మాతోటి కాదు. పనిచేసిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటం. గ్యాస్ ధర ఇంతగనం పెరిగితే మాలాంటి పేద వారు ఎలా బతకాలె. కట్టెలకు పోదామంటే ఎక్కడ దొరుకుతలెవ్వు. పిల్లలు, జెల్లలు ఉప్పిడి ఉపాసం ఉండుడేనా. ఇప్పటికైనా గ్యాస్ ధర తగ్గించాలె. ఒక్కనాడే 50 రూపాలు పెంచుడు మరీ ఘోరం. గ్యాస్మొద్దు ధరలు దిగకుంటే కట్టెల పొయ్యిలే దిక్కు అయ్యేటట్టుంది. ప్రభుత్వం పేదల పట్ల దయచూపాలి. గ్యాస్ మొద్దుల ధర దిగకుంటే బతుకుడు కష్టమే ఉన్నది.
– పసుల అహల్య, మైదం కవిత, మాధవరావుపల్లి, ములుగు
ములుగు, మార్చి 1(నమస్తే తెలంగాణ) : నేను ఎంతోకాలం నుంచి ములుగు గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న. ఊకూకె గ్యాస్ ధరలు మేమే పెంచుతున్నమనుకొని సిలిండర్ దించేటప్పుడు వినియోగదారులు మాతోటి లొల్లిపెట్టుకుంటాండ్రు. నేను సిలిండర్ ధర రూ.475 ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్న. ఎప్పుడు లేనిది ఈ మధ్య ప్రజలు సిలిండర్ తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే డబ్బులు లేక బుక్ చేసిన సిలిండర్లను రద్దు చేసుకుంటున్నరు. దీంతో మాకు సమయం చాలా వృథా అవుతున్నది. ప్రజలు గ్యాస్ తీసుకునే దాకా వేచి ఉండాల్సి వస్తున్నది. సిలిండర్లు తీసుకునేటప్పుడు ఆడోళ్లు చానా లొల్లి చేస్తున్నరు.
– ధరావత్ రమేశ్, గ్యాస్ డెలివరీ బాయ్, ములుగు జిల్లాకేంద్రం
మహదేవపూర్ : నేను ఉజ్వల పథకం కిందం గ్యాస్ కనెక్షన్ తీసుకున్న. గతంల గ్యాస్ ధర తక్కువ ఉండె. గ్యాస్ పొయ్యిమీదే వంట చేసుకునేటోళ్లం. బీజేపీ వచ్చినంక రోజురోజుకూ గ్యాస్ ధర పెరుగుతాంది. గంతగనం పైసలువెట్టి గ్యాస్ మొద్దు కొనాలంటె కండ్ల నీళ్లు వస్తున్నయ్. అందుకే గ్యాస్ పొయ్యి వాడుడే బందువెట్టినం. కూలీ పని చేసి బతికేటోళ్లం. గ్యాస్ మొద్దు కొనే స్తోమత లేక అడివికివోయి కట్టె పుల్లలు ఏరుకచ్చి వంట చేసుకుంటున్నం. ఇప్పుడు గ్యాస్ ధర మళ్ల పెరిగింది. ఇగేం కొంటం. అందుకే మా ఇంట్ల గ్యాస్ మొద్దును ఎప్పుడో సజ్జమీద పారేసినం.
– తొగరి మైసక్క, ఎల్కేశ్వరం, మహదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
నర్సింహులపేట : నేను రోజూ కూలి పనికి పోత. పైసలస్తెనే ఏమన్న తెచ్చుకొని వండుక తింటం. దినదినగండం లెక్క గడుస్తుంటే మీద పిడుగు వడ్డట్లు గ్యాస్ ధర ఊకూకె పెరుగుతాంది. పన్నెండు వందలదాక పోయింది. గంత ధర పెట్టి ఏం కొంటమని గ్యాస్ పొయ్యి బందువెట్టిన. పొలాల దిక్కుపోయి కట్టెలు ఏరుకచ్చుకొని వంట వండుతాన్న. ఓ రోజు పనికి పోకుండ ఉంటెనే కట్టెలు తెచ్చుకునుడు అయితాంది. గీ వైసుల కట్టెలు ఏరుకరావాల్నంటే శాతనైతలేదు. ధర ఇట్ల పెంచుకుంటవోతె మా అసోంటోళ్ల గతేంగావాలె సారు?.
– కందునూరి వెంకటమ్మ, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా