వానకాలం, యాసంగి పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు అవగాహన లేక భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషకపదార్థాలను గ్రహించి భూమికి సత్తువ (బలం) లేకుండా చేస్తాయి. అదే వేసవి లోతు దుక్కులతో బోలెడు లాభాలు ఉన్నాయి. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. భూమిలో తేమ శాతం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు నివారణతోపాటు మరిన్ని ప్రయోజనాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
– నర్సంపేట రూరల్, ఏప్రిల్ 27
లోతు దుక్కితో లాభాలు అనేకం…
వేసవి కాలంలో లోతు దుక్కులతో చాలా లాభాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. దీంతో భూమిలో తేమ శాతం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపు మొక్కల నివారణతో పాటు ఎక్కువ ప్రయోజనాలు సమకూరుతాయి. వేసవి లోతు దుక్కులు దున్నే ముందు పశువుల పెంట, పోగు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా భూమి సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది.
యాసంగి సీజన్ దాదాపుగా ముగిసింది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో భూసారం పెరిగేలా రైతులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులుండవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవి లోతు దుక్కులు చేసుకోవడానికి ఇదే సరైన సమయమంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వానకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల రైతుకు అనేక లాభాలు కలుగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కలుపు నివారణ..
రైతులు సీజన్కు ముందుగా వేసవి లోతు దుక్కులను తయారు చేసుకోకపోవడంతో కలుపు పెరిగి రైతుకు అదనపు భారంగా మారుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరిగి అవి భూమిలోని నీరు, పోషక పదార్థాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల పురుగులు, శిలీంద్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. వేసవి లోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలతోపాటు వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరి నశిస్తాయి.
రైతులు వేసవి లోతు దుక్కులు చేపట్టాలి
– కృష్ణకుమార్, మండల వ్యవసాయ అధికారి, నర్సంపేట
లోతు దుక్కులతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. ప్రస్తుతం వేసవి లోతు దుక్కులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లోతు దుక్కులతో చీడ పీడల నివారణతోపాటు నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని వేసవిలో లోతు దుక్కులు చేపట్టాలి. ముఖ్యంగా పత్తి సాగు చేసే రైతులు లోతు దుక్కులు చేస్తే చాలా లాభాలు గడించవచ్చు.
భూసారం పుష్కలం…
వేసవి లోతు దుక్కులు లోతుగా, వాలుగా, అడ్డంగా దున్నుకోవాలి. వాలు, అడ్డంగా దున్నడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వేసవి లోతు దుక్కులు దున్నే ముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలు తోలడం వల్ల అవి విసర్జించిన వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఫలితంగా భూసారం పెంపొందుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికి అందగానే పంట నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్తా చెదారం కాల్చివేయకుండా అవకాశం ఉన్న వారు లోతు దుక్కులు చేయడంతో నేల పొరల్లో కలిసిపోయి, ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది.
పంటకు కావాల్సిన పోషక పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. వేసవిలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలో నేల, చెత్తా చెదారం, కోయ కాడల్లో ఎక్కువ కాలం గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంద్రాలు భూమిలోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంద్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలోని చీడ పురుగుల కోశాలు, గుడ్లు, లార్వాలు పక్షులు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తాయి. అదేవిధంగా వ్యవసాయ దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి. బయట అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి.