అతడు చదివింది బీటెక్. ఉన్నత ఉద్యోగం చేసే అవకాశమున్నప్పటికీ చేపలు పెంచాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఓ వైపు మెడికల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతూనే వ్యవసాయ అనుబంధ రంగంపైనా ఇష్టం పెంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన సొంతూరు కాటారం మండలం కొత్తపల్లిలో ప్రయోగాత్మకంగా 4.20 ఎకరాల్లో మూడు చేపల చెరువులు తవ్వించడంతో పాటు వాటి గట్లపై సుమారు వెయ్యి దాకా టేకు, కొబ్బరిమొక్కలు నాటాడు. ఇలా రెండేళ్ల క్రితం మొదలైన ఈ చేపల పెంపకంతో అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.5లక్షల దాకా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం యువత పట్టణాలకు పరుగుతీస్తున్న క్రమంలో దాసరి రఘు వ్యవసాయ రంగంలో విశేష ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
– భూపాలపల్లి, జనవరి 6 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దాసరి రఘుగౌడ్ బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో అతనికి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అక్కడ వారి కుటుంబీకులకు చేపల చెరువులు ఉన్నాయి. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ యువరైతు తన స్వగ్రామంలో చేపల పెంపకం మొదలుపెట్టాడు.
4.20 ఎకరాల్లో చేపల చెరువులు
రఘుగౌడ్ తండ్రి సింగరేణి ఉద్యోగి. అతని స్వగ్రామమైన కొత్తపల్లిలో ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2020 సంవత్సరంలో నాలుగెకరాల 20 గుంటల్లో మూడు చేపల చెరువులు తవ్వించాడు. ప్రతి సంవత్సరం పెట్టుబడి పోను అదనంగా ఆదాయం అర్జిస్తున్నాడు. ఎక్కువగా సొంత భూముల్లో చెరువులను తవ్వి చేపల పెంపకాన్ని చేపట్టడం వంటివి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఇటీవల చేపల పెంపకం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రఘుగౌడ్ అనే యువ రైతు ఈ చేపల పెంపకం ప్రారంభించాడు. రక్షణ కోసం చుట్టూ సీసీ కెమెరాలు అమర్చి నీటి వసతి కోసం ఇది వరకే ఉన్న బోరును వినియోగిస్తున్నాడు. చేపల సంరక్షణ కోసం ఇద్దరిని నియమించుకోవడం పాటు కొంగల బారి నుంచి చేపలను కాపాడేందుకు చెరువులపై వలలు ఏర్పాటు చేశాడు.
చెరువుల చుట్టూ టేకు, కొబ్బరి మొక్కలు
చెరువు గట్లపై సుమారు వెయ్యి టేకు, కొబ్బరి మొక్కలు నాటాడు. కొన్ని సంవత్సరాలు పెంచితే వీటి ద్వారా అదనంగా ఆదాయం సమకూరనున్నది. ఇలా విభిన్న రీతిలో ఆలోచించి అతను ముందుకు సాగుతున్నాడు.
ఏటా పెట్టుబడి పోను రూ.5 లక్షల ఆదాయం వస్తది -దాసరి రఘుగౌడ్
నేను ఈ చేపల చెరువులను 2020 సంవత్సరంలో మా సొంత భూమిలో తవ్వించాను. అప్పుడు రూ.10 లక్షల వరకు ఖర్చయింది. మొదటి సంవత్సరం ఆదాయం అంతంత మాత్రమే వచ్చింది. ఆ తర్వాత మాత్రం బాగానే ఉంది. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి పంట వస్తుంది. ఒక్కో చేప కిలో నుంచి కిలో పావు వరకు బరువు పెరుగుతాయి. ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పంట వస్తుంది. ఈ చేపలను స్థానికంగా హైదరాబాద్కు మార్కెటింగ్ చేస్తాను. పెట్టుబడి పోను ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి రూ.2.50 లక్షల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నేను ఇదే కాకుండా మెడికల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. యాజమాన్య పద్ధతులు సరైన రీతిలో పాటించి చేపల పెంపకం చేపడితే మంచిదే. జిల్లాలోని చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి అడిగి తెలుసుకుంటున్నారు. మత్స్యశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్నేహితుల కుటుంబీకులు చేస్తున్నది చూసి మెళకువలను తెలుసుకొని ఇక్కడ చేపల చెరువులను తవ్వించి పెంపకం చేపట్టాను.
చేపల పెంపకం మంచిదే..
వ్యవసాయ అనుబంధ రంగమైన చేపల పెంపకం చేపట్టడం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. రఘుగౌడ్ చేపల పెంపకాన్ని చేపట్టాడు. పలువురు రైతులు ఈ చేపల పెంపకం చేపట్టడానికి మొగ్గు చూపుతున్నా రు. చేపల పెంపకానికి అవసరమైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఎలా తీసుకోవాలనే విషయమై రఘుగౌడ్కు మా శాఖ నుంచి సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
– ఆర్. అవినాష్, జిల్లా మత్స్య శాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి