కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె… ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది… నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదారి జలాలు వృథాగా పోయి సముద్రంలో కలుస్తుంటే… నాటి ఉమ్మడి పాలకులకు సోయి లేకుండ పాయె. తెలంగాణపై కుట్రలతో ఇక్కడి భూములను బీడు పడేలా చేసిండ్లు. కానీ, ఉద్యమ రథసారథి కేసీఆర్తో ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని దశ మార్చుకున్నం. చెరువులు, వాగులు, వంకలు మండుటెండల్లోనూ జల సవ్వడితో మురిసిపోతున్నయ్… తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిగా మారింది. అపర భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఇక్కడ నుంచే పునాది పడింది. దీంతో నేడు తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది’ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్నారం బరాజ్ వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు బరాజ్ వద్దకు వచ్చిన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులతో రాగా వారికి కలెక్టర్ భవేశ్ మిశ్రా, జడ్పీ చైర్పర్సన్ దంపతులు జక్కు శ్రీహర్షిణి రాకేష్ స్వాగతం పాలికారు. అనంతరం సభ ప్రాంగణం వద్ద జ్వోతి ప్రజ్వలన చేశారు. సింగర్ మంగ్లీ, శివజ్యోతి తమ గానంతో రైతులను కట్టిపడేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాగునీటి రంగం పురోగతి సాధించిందన్నారు. ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మళ్లించిన కాళేశ్వరం నిర్మించిన సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిలో నిలుస్తుందన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన అపర భగీరథుడని కొనియాడారు. కేసీఆర్ ప్రధాని అయితే భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. కరువు నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు.
మంత్రి కల్వకుంట్ల రామన్నకు ములుగు జిల్లా ప్రజలతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మంత్రిని కలిసిన వారిలో మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నాగుర్ల వెంకటేశ్వర్లు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్ ఉన్నారు.
ఎడారిగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు భగీరథుడిలా గోదారినే మెప్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుం దని, ఆయనతోనే తెలంగాణ సాధ్యమైందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారన్నారు. ప్రాజెక్టులో కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి సత్కరించిన ఘనత కూడా ఆయనదే అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో సాగు, తాగు, విద్యుత్, విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోనే రాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన చెరువులను పునరుద్ధరించి కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయలో ప్రతి చెరువు నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దారన్నారు. సాగునీటి రంగం అభివృద్ధితో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తాను సీఈ, ఈఎన్సీ బాధ్యతలు నిర్వర్తించానని, సీఎం కేసీఆర్తో కలిసి పనులు పూర్తి చేయడం ప్రముఖపాత్ర పోషించానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తవడంలో సీఎం కృషి మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు.
అన్నారం బరాజ్ వద్ద జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు అద్భుతమని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. అన్నారం బరాజ్ వద్ద ఉత్పవాలు తన ఆధ్వర్యంలో నిర్వహించడం అదృష్టం అన్నారు.