గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది. వరదలో చిక్కుకున్న వారిని కాపాడి నందుకు సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై నరేశ్ను, చెరువులో తెగిన హైటెన్షన్ వైర్ను తెప్పపై పోయి సరిచేసిన జేఎల్ రెహమాన్ను మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించి, అవార్డు ఇవ్వనున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/ దేవరుప్పుల, ఆగస్టు 14
విధి నిర్వహణలో తన కర్తవ్యాన్ని, నిబద్ధతను చాటాడు ట్రాన్స్కో జూనియర్ లైన్మన్ మహ్మద్ రెహమాన్. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం క్లస్టర్లో ట్రాన్స్కో జేఎల్ఎంగా పనిచేస్తున్న ఆయన జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ధర్మాపురం ఊర చెరువు మధ్య నీటిలో 11 కేవీ లైన్పై తుమ్మ చెట్టుపడి తెగింది. అప్పటికే చెరువు ఉధృతంగా అలుగు పోస్తుండగా అందులో 18 ఫీట్ల లోతులో నీరుంది. లైన్ తెగడంతో మొండిచింత తండాకు, జియో టవర్కు విద్యుత్ నిలిచిపోయింది. తండాలో అంధకారాన్ని తొలగించే క్రమంలో సాహసానికి ఒడిగట్టాడు. సాయంత్రం మూడు గంటలకు మత్స్యకారులు చేపలు పట్టే తెప్పపై 8 కిలోల కట్టెకోత మిషన్, రెండు ఇన్సులేటర్లు, 5 కిలోల తాడును ఉంచి ఫర్లాంగ్ దూరంలో ఉన్న వైర్ తెగిన స్తంభం వద్దకు ఒక్కడే చేరాడు. చెట్టును నరికి, స్తంభంపైకి ఎక్కి వైర్ అతికి అదే తెప్పపై సాయంత్రం 6 గంటలకు ఒడ్డుకు చేరుకున్నాడు. జేఎల్ఎం మహ్మద్ రెహమాన్ చేసిన ఈ సాహసాన్ని ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించింది. దీంతో ప్రభుత్వం గుర్తించి ఇతన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చేతుల మీదుగా సన్మానం చేయాలని నిర్ణ యించింది. ఈ క్రమంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి హైదరాబాద్కు రావాలని, మంగళవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చేతుల మీదుగా సన్మానం ఉంటుందని తెలిపారు. దీంతో రెహమాన్ బయలుదేరి వెళ్లాడు.
విధుల్లో నిబద్ధత చాటిన పోలీసులకు అరుదైన గౌరవం లభించింది. జూలై చివరి వారంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో వచ్చిన వరద సహాయక చర్యల్లో పోలీసు సేవలను ప్రభుత్వం గుర్తించింది. కొయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నగర్లో మానేరు నది వరదలో చిక్కుకున్న ఇద్దరిని కొయ్యూరు ఎస్సై వీ నరేశ్ తన సిబ్బందితో కలిసి కాపాడారు. అదేవిధంగా వరద ఉధృతితో భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె ఒదిరెడ్డి కొట్టుకుపోయి మరణించాడు. మృతదేహం కుళ్లిపోగా భూపాలపల్లి సీఐ రాంనరసింహా రెడ్డి కర్రల సాయంతో మోసుకొచ్చాడు. దీంతో వీరి సేవలను గుర్తించిన సర్కారు స్పెషల్ అవార్డును ప్రకటించింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో జరిగే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ఇద్దరు అధికారులు స్పెషల్ అవార్డు అందుకోనున్నారు.