నర్సంపేట, నవంబర్ 8: మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ తరఫున సుదర్శన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడారు. సీఎం కేసీఆర్ దీవెనలతో తాను ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో కుల, మత, వర్గ భేదం లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు. స్థానికంగా ఉంటూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోసారి తనను ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలువకముందు డివిజన్లోని గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 360 కిలో మీటర్ల తారురోడ్లు, 360 కిలో మీటర్ల సీసీరోడ్లు పూర్తయినట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం మెరుగుపడిందని, మెడికల్ కళాశాలతోపాటు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత డివిజన్లోని 179 గ్రామాలకు ఇంటింటికీ పీఎన్జీ గ్యాస్ను తక్కువ ధరకే అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలను కోరారు. నర్సంపేటలోని 1, 2, 3, 13, 14, 15, 16, 22వ వార్డులో పెద్ది విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవన్నారు. నర్సంపేట పట్టణాన్ని సుమారు రూ. 50 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. సెంట్రల్ లైటింగ్, తారురోడ్లు, సీసీరోడ్లు పూర్తి చేశామన్నారు. డివైడర్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి మందికి అనువుగా పట్టణంలో ఆడిటోరియం నిర్మించామన్నారు. అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. నర్సంపేటలో 450 పడకల జిల్లా ఆస్పత్రి నిర్మాణంలో ఉందన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లో 120 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నల్లా మనోహర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు దేవోజు తిరుమల, జుర్రు రాజు, రుద్రమళ్లీశ్వరి, నాగిశెట్టి పద్మ, గంప సునీత, పాషా, మినుముల రాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నర్సంపేట బీఆర్ఎస్, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి నామినేషన్ వేసే ముందు మండలకేంద్రంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి అమృతమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుమారుడికి నియోజకవర్గ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, అలాగే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు.