నర్సంపేట, అక్టోబర్ 16 : ప్రతిపక్ష నాయకులు చీకటి కలయికలు, రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులు ఒక్కటై తనను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారని, 2014, 2018 ఎన్నికల్లోనూ వారు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. 2014లో ఇద్దరు ఒక్కటై తనను ఓడించగా, 2018లో వారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారని, కానీ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని తెలిపారు. అదే మాజీ ఎమ్మెల్యేలు రెండు నెలల ముందే మళ్లీ ప్రజల్లోకి వచ్చారని, మరో నెల తర్వాత మళ్లీ స్లీపింగ్ మోడ్లోకి పోతారని చెప్పారు. గత పాలకులు ఐదారు సార్లు ఓట్లు వేయించుకుని, ప్రజలకు మొండిచేయి చూపారని తెలిపారు. వారికి పాలనా వ్యవస్థపై పట్టు లేదని, పసలేని విమర్శలు తప్ప ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పగలిగే స్పష్టత లేదన్నారు. ఒక విజనరీ ఆలోచనతో ముందుకెళ్తున్న తనకు సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గ ఖ్యాతిని తండా, పల్లెల నుంచి అసెంబ్లీకి వినిపించానని తెలిపారు. తన రెసిడెన్సీ కూడా ఇక్కడేనని, ఎమర్జెన్సీ సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ప్రతిపక్షాల ధర్నాలు, నిరసనలకు అవకాశం లేకుండా పనిచేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు బతికునిచ్చామని చెప్పుకునే బీజేపీ నాయకులు పత్తాలేకుండా పోయారన్నారు. అన్ని వర్గాల కులాలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు మరోసారి తనకు ఇవ్వాలని కోరారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే మన రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రంగాయ, రామప్ప, పాకాల చెరువు ప్రాజెక్టులతో రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించి రైతుల పాదాలు కడిగే అవకాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మెడికల్ కళాశాల వంటివి పూర్తి కావాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తాను 2014లోనే గెలిచి ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి మరోలా ఉండేదన్నారు. ఇప్పుటికే నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేక పథకాలను తీసుకువచ్చి అన్నివర్గాల ప్రజలకు అందించానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పురోగతి స్పష్టంగా కనిపిస్తోదని తెలిపారు. పట్టణంలోనూ చాలావరకు పనులు పూర్తయ్యాయని, మినీ ట్యాంక్బండ్ గతంలోనే తాను తీసుకురాగా టెండర్లు వేసి పనులు కాకుండా ప్రతిపక్ష నాయకుడు కుట్రలు చేశారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర మెంబర్ రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, మేఘ్యానాయక్ పాల్గొన్నారు.