2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజర్వాయర్ నీళ్లు ప్రతి ఎకరాకు అందితే ఈ ప్రాంతం కోనసీమను తలపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్కు లక్ష్మి నియోజకవర్గంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం రూ.9వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. హుస్నాబాద్కు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మిడ్మానేరు-తోటపల్లి, దేవాదుల, కాకతీయ కాల్వ ద్వారా నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు సాగునీరందుతోందని, దీంతో నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో పుష్కలంగా పంటలు పండుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం రూ.60లక్షల అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. గిరిజన తండాల రోడ్లకు రూ.61కోట్లు వెచ్చించామంటే ఎంత అభివృద్ధి జరిగిందో అర్థమవుతున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టి కేసులు వేయకుంటే గౌరవెల్లి రిజర్వాయర్ను ఇప్పటికే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకునే వాళ్లమని, ఆ రెండు పార్టీల నాయకులకు ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు రావడం ఇష్టం లేదని విమర్శించారు. వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ను, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు.