సంగెం, డిసెంబర్ 9: జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో అర్హులను గుర్తించి టీకాలు వేసి ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని మొండ్రాయి, పల్లార్గూడలో వ్యాక్సినేషన్ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొదటి, రెండో డోస్ వివరాలను ఏఎన్ఏంలు, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు టీకాలు వేయించుకోని వారి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్లోనే వందశాతం పూర్తి చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పల్లార్గూడలో నర్సరీ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డును పరిశీలించి సర్పంచ్, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి, హెచ్ఈవో సత్యరాజ్, ఏఎన్ఎంలు నిర్మలాజ్యోతి, కవిత, కార్యదర్శి రమేశ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాక్సిన్తో రోగనిరోధకశక్తి పెరుగుతుంది
కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని నర్సంపేట మండలం భోజ్యనాయక్తండా సర్పంచ్ భూక్యా లలిత, టీఆర్ఎస్ మండల నాయకుడు భూక్యా వీరన్ననాయక్ అన్నారు. భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. వర్ధన్నపేట మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. 18 ఏళ్లు నిండిన వారికి వైద్య శిబిరాలకు వెళ్లి టీకాలు వేసుకుంటున్నారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేతృత్వంలో మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్ సారథ్యంలో మండలంలోని 11 ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో అర్హులను గుర్తించి టీకాలు వేస్తున్నారు. గురువారం సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(ఎస్), బాలునాయక్ తండాలో ఏఎన్ఎం భూక్యా ఝాన్సీ, కేర్ ఇండియా మొబిలైజర్ గద్దల రామ్మూర్తితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు నలమాస సారయ్య, గూబ యాకమ్మ-ఎల్లయ్య, బానోత్ పద్మ-రవినాయక్, బానోత్ జగన్నాయక్, కార్యదర్శులు బత్తుల నర్సయ్య, జన్ను అనిల్కుమార్, చల్లా అజిత్రెడ్డి, అనిల్కుమార్, ఆశ వర్కర్లు సుమలత, పారిజాత, లక్ష్మి పాల్గొన్నారు. గీసుగొండ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అపోహలను తొలగిస్తూ కరోనా టీకాలు వేస్తున్నారు.