మల్హర్, ఫిబ్రవరి 26 : డేంజర్ జోన్లో ఉన్న గృహాలను తీసుకునే వరకూ బొగ్గు తవ్వకాలు చేపట్టొద్దంటూ సోమవారం తాడిచర్ల భూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏఎమ్మార్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటివరకూ తీసుకోలేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో బ్లాస్టింగ్లతో ఇళ్లలోకి దుమ్ము, ధూళి వచ్చి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే దాకా బొగ్గు తవ్వకాలను నిలిపివేయాలని మైన్లో పనులను అడ్డుకున్నారు. కంపెనీ అధికారులు, కాటారం డీఎస్పీ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. జెన్కో సీఈ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన ఆపేది లేదని ఆందోళనకారులు తేల్చిచెప్పారు.
దీంతో కంపెనీ అధికారులు సీఈకి సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అవుతున్నదని, నాలుగు నెలల సమయం ఇస్తే జెన్కో బోర్డు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బండి స్వామి, రావుల ఆంజనేయులు, ఆర్ని సత్యనారాయణ, రామిడి గట్టయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు. కాటారం సీఐ నాగార్జునరావు, కొయ్యూరు, కాటారం ఎస్సైలు నరేశ్, అభినవ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.