నల్లబెల్లి, ఆగస్టు 12: వరంగల్ జిల్లాకు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 31ని విడుదల చేసింది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుండగా, ఇప్పటికే అధికారులు 54 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. స్థానిక రైతులకు ఈ సెంటర్ వరం కానుండగా, భవిష్యత్లో హార్టికల్చర్ కళాశాల మంజూరయ్యే అవకాశం ఉన్నది. కాగా, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిసి సెంటర్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ జిల్లాకు హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మంజూరైంది. ఈ సెంటర్ నిర్మాణం పూర్తయితే అన్నదాతలకు వరంగా మారనుంది. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ శనివారం జీవో నంబర్ 31 విడుదల చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కన్నారావుపేటలోని సర్వే నంబర్ 58లోని 54 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నాలుగేళ్ల కృషి ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యాన పరిశోధనా కేంద్రం మంజూరు కావడంతో నర్సంపేట డివిజన్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే చేసిన విషయం తెలిసిందే. కానీ, ఒకే పంటపై కాకుండా రైతుల భవిష్యత్ దృష్ట్యా పంటల మార్పిడి జరిగినప్పుడు అన్నదాతలకు ఉపకరిస్తుందనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు. రాష్ట్రంలో పండే అన్ని రకాల పంటలకు ఇక్కడే పరిశోధన చేసే అవకాశాలు ఉన్నాయి.
గజ్వేల్ నియోజకవర్గం ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఈ ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా ఎమ్మెల్యే పెద్ది పట్టుదలతో పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉండడం వల్ల భవిష్యత్లో ఇక్కడే హార్టికల్చర్ కళాశాలను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే పెద్ది ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలాఉంటే.. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సహకారంతో పాకాల, రంగాయచెరువు, మాదన్నపేట చెరువుల్లోకి గోదావరి జలాలను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత పెద్దికే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీనికితోడు నల్లబెల్లి మండలంలో హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో ప్రగతి రథచక్రాలతో నర్సంపేట నియోజకవర్గం మురిసిపోనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు
కన్నారావుపేటలో ఉద్యాన పరిశోధనా కేంద్రం మంజూరు చేసిన సీఎం కేసీఆర్తోపాటు సహకరించిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వారిని కలిశారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
కన్నారావుపేటలో హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం మంజూరు చేయడం ఆనందంగా ఉంది. గత ఏడాది నల్లబెల్లి మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న రంగాయ చెరువులోకి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గోదావరి జలాలను తీసుకొచ్చారు. నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను మంజూరు చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటాం. మారుమూల ప్రాంతంపై చూపిస్తున్న ముఖ్యమంత్రి ప్రేమ మరువలేనిది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి మండల ప్రజల పక్షాణ కృతజ్ఞతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం రుణం తీర్చుకుంటాం.
– తంగెళ్ల నిర్మల, కన్నారావుపేట సర్పంచ్