హనుమకొండ చౌరస్తా/గిర్మాజీపేట, జూన్ 23: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం హనుమకొండ, వరంగల్లో భారీ వర్షం పడగా మిగతా చోట్ల మోస్తరుగా కురిసింది. తొలకరి వర్షాలతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడడంతో జనం పరవశించిపోయారు. నగరంలోని ప్రధాన రహదారులపై వరద నీరు వచ్చి చేరింది. సుమారు గంటసేపు కురిసిన వర్షానికి నిలిచిపోయారు. హనుమకొండ బస్స్టేషన్లో, కాకాజీకాలనీ, జూనియర్ కళాశాల రోడ్లపైకి వరద నీరు వచ్చింది.
హంటర్రోడ్ పాత బీట్బజార్, వరంగల్ చౌరస్తా ప్రాంతాల్లో రహదారులు కనిపించలేనంతగా వాన దంచికొట్టింది. నిన్నటివరకు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఊరటనిచ్చాయి. ఇక వర్షాలు మొదలవడంతో వాగుల్లోకి వరద వచ్చి చేరుతోంది. అలాగే రైతులు సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. పొలంబాట బట్టి దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలు వేయడం ప్రారంభించారు.