పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 12: : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్ల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, ఫలితంగా వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో మహిళా ఆరోగ్య క్లినిక్తో పాటు హెల్ప్ డెస్క్ సెంటర్లను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో వైద్య విద్యకు చిరునామాగా తెలంగాణ రా్రష్ట్రం నిలిచిందన్నారు. మారుమూల పల్లెలకు సైతం పల్లె దవాఖానలను నూతనంగా ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రం లో 9 వైద్య కళాశాలల తరగతులను ప్రారంభిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణలో రెండు మెడికల్ కళాశాలలు ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జనగామలో రూ.300 కోట్లతో మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రూ.1400 కోట్లతో వరంగల్లో నూతనంగా అత్యాధునిక పరికరాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు భవనాలను నిర్మిస్తున్నామన్నారు. పాలకుర్తి ప్రభుత్వ దవాఖానను 50 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. దీనిపై వైద్య శాఖ మంత్రి హరీశ్రావు త్వరలోనే జీవో విడుదల చేస్తారని చెప్పారు.
రాష్ట్రంలో 1200 ఆర్యోగ్య మహిళ క్లినిక్లు
రాష్ట్రంలో 1200 ఆరోగ్య మహిళ క్లినిక్లను ఏర్పాటు చేశామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. జనగామ జిల్లాలో పాలకుర్తి, దేవరుప్పుల, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, ధర్మకంచ దవాఖానల్లో నూతనంగా ప్రారంభించామన్నారు. గతంలో స్టేషన్ ఘన్పూర్, ఇప్పగూడెం పీహెచ్సీల్లో మాత్రమే మహిళ క్లినిక్లు ఉండేవన్నారు. ప్రతి మంగళవారం దవాఖానలో మహిళలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. గర్భిణులకు ఉచితంగా న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. దవాఖానలల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో కంటే ప్రభుత్వ దవాఖానల్లోనే నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు.
102 వాహనం ద్వారా ప్రతి గర్భిణికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపిస్తున్నామన్నారు. గతంలో తాను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. కాగా తమకు రెగ్యులర్గా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆశ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీ సుహాసిని, జిల్లా వైద్యాధికారి ప్రశాంత్కుమార్, వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి డాక్టర్ సుగుణాకర్రాజు, ఉప వైద్యాధికారి సుధీర్, వైద్యాధికారులు భూక్యా రవిరాథోడ్, దువ్వల లింగమూర్తి, జ్యోతి, అజయ్, ఉషా, విజయ్, అఫ్రోజ్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎంపీటీసీలు ఎడవెల్లి పురుషోత్తం, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, వీరమనేని హనుమంతరావు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.