వరంగల్ చౌరస్తా, జనవరి 28 : వరంగల్లో కడుతున్న హెల్త్ సి టీ దేశానికే మోడల్లా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాల పనులను శనివారం ఆయన పరిశీలించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. రూ.1100 కోట్లతో ఆర్అండ్బీ పర్యవేక్షణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానం ద్వారా ఎల్అండ్టీ సంస్థ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 16.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో అతిపెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నదని, అందులో 14.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 రకాల వైద్య, పారా మెడికల్ సేవలు ఉంటాయని, తలసీమియా బాధితులకు ప్రత్యేక విభాగం ఏర్పాటవుతుందని, మిగిలిన రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విద్యార్థులు తరగతి గదులు, లైబ్రరీ, సెమినార్ హాల్ నిర్మిస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ పనులను చూసి అనంతరం సమీక్షలో చేసిన సూచనల ఆధారంగా డిజైన్లో కొన్ని మార్పులు చేశామని, దీంతో 450 పడకల సామర్థ్యం అదనంగా పెరిగిందని తెలిపారు. హెల్త్ సిటీ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే వరంగల్ను హెల్త్ హబ్గా ప్రకటించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్కును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంజీఎం వైద్యశాల పెద్ద దిక్కుగా మారిందని, ఎంజీఎం స్థాయికి మించి సేవలు అవసరమవుతున్న విషయాన్ని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ హాస్పిటల్లో అవయవ మార్పు సంబంధిత శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పై అంతస్తుల పనులు కొనసాగుతుండగానే కింది అంతస్తుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఇంజినీరింగ్ అధికారుల సమన్వయంతో యంత్రాల ఏర్పాటుకోసం నిర్మాణాలు చేయాలని సూచించారు. వచ్చే దసరా నాటికి నిర్మాణం పూర్తికావాలని ఆదేశించినట్లు వివరించారు.
దేశవ్యాప్తంగా కంటి వెలుగు
తెలంగాణలో అమలవుతున్న కంటివెలుగు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని మంత్రి హరీశ్ తెలిపారు. ఖమ్మంలో రెండో విడత కంటివెలుగు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు వారి రాష్ర్టాల్లోనూ కంటివెలుగును అమలుచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రెండో విడత కంటివెలుగులో 1500 బృందాలు పని చేస్తున్నాయని, రోజూ 1.5లక్షల నుంచి 2.25 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అద్దాలను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజు, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, ఆర్డీవో ఆఫ్రిన్సిద్ధిఖీ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
త్వరలోనే పల్లె దవాఖానలు
వరంగల్ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న బస్తీ దవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరికి పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన మండలానికి 6 నుంచి 10 వరకు పల్లె దవాఖానల్లో వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఏఎన్ఎం సెంటర్లుగా ఉన్న వాటిని త్వరలోనే పల్లె దవాఖానలుగా మారుస్తామన్నారు. ఇందుకోసం 2వేల మంది వైద్యులకు శిక్షణ ఇస్తామని, పల్లె దవాఖానలో వైద్య పరీక్షలు, మందులు, సేవలన్నీ ఉచితంగా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు.
వైద్య సేవల్లో దేశంలోనే మొదటి స్థానం
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం, వైద్యసేవల విషయంలో చిట్ట చివరన ఉన్న తెలంగాణ, నేడు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ప్రతి 19మంది రోగులకు ఒక ఎంబీబీఎస్ వైద్యుడు అందుబాటులో ఉన్నాడని చెప్పారు. మున్ముందు 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణలో మూడే మెడికల్ కళాశాలలు ఉన్నాయని, ఇప్పుడు 157 వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మొండిచెయ్యి చూపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా నేడు 12 వైద్య కళాశాలల్లో విద్యాబోధన కొనసాగుతున్నదని చెప్పారు. ఒకే విద్యాసంవత్సరంలో ఎనిమిది మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యను ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వాటికి అనుసంధానంగా రానున్న రోజుల్లో పీజీ మెడికల్, సూపర్ స్పెషాలిటీ సీట్ల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకోసం త్వరలోనే 1300మంది ప్రాఫెసర్ల నియామకాలు చేపడుతామన్నారు. ప్రసవాల నమోదులో ప్రభుత్వ హాస్పిటళ్లు మెరుగ్గా పని చేస్తున్నాయన్నారు. గతంలో శిశు జననాల సంఖ్య ప్రభుత్వ దవాఖానల్లో 30శాతం మాత్రమే ఉండేదని, కేసీఆర్ కిట్, పౌష్టికాహారం, డైట్ కిట్లు, మెరుగైన వసతుల కారణంగా ఇప్పుడు 60శాతానికి పెరిగాయని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలను విస్తృతం చేసేందుకు 926 మంది వైద్యుల నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతిపక్షాల కండ్లు బైర్లు కమ్ముతున్నయ్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, ప్రతి నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డు పడడమే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చిం ది లేదని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టిన నాటి నుంచి ఇది పూర్తయ్యేదెప్పుడు నీళ్లు వచ్చేదెప్పుడు, అసలిది సాధ్యమేనా అని మాట్లాడిన నోటితోనే కాళేశ్వరం నీరు తాగుతూ, అవే నీటితో పండిన పంట తింటున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు పంటలు పండుతున్నాయంటే దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనని పునరుద్ఘాటించారు. భూపాలపల్లి, పరకాల, జనగామ, నర్సంపేట నియోజకవర్గాల్లో ప్రతి చెరువు కాళేశ్వరం నీటితో మత్తడి పోస్తుంటే ప్రతిపక్షాలు కళ్లు తేలేసి చూస్తున్నాయన్నారు. అదే విధంగా వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో పేదల కోసం కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కడుతామని కేసీఆర్ చెప్పినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇలానే ప్రవర్తించాయని, ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న పనులను చూసి ప్రతిపక్షాల బైర్లు కమ్ముతున్నాయన్నారు. వచ్చే దసరా నాటికి మెగా వైద్యశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.