ఖిలావరంగల్, డిసెంబర్ 8 : అభివృద్ధికి మోడల్గా వరంగల్ను తీర్చిదిద్దుతున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం శివనగర్లోని కార్మిక పరపతి సంఘం (కేపీఎస్) కన్వెన్షన్ హాలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో 70 ఏళ్లలో జరుగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని, శివనగర్ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అత్యధిక నిధులతో శివనగర్ను అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు పారదర్శకంగా ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు.
శివనగర్లో వరదనీటి తరలింపు కోసం వాటర్ డ్రైయిన్, అలాగే సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించామన్నారు. తూర్పు నియోజక వర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. నూతన బస్టాండ్, కలెక్టరేట్ భవనాలను త్వరలోనే నిర్మించనున్నామన్నారు. కార్మిక సంఘం భవన నిర్మాణానికి రూ.30లక్షలు నిధులు మంజూరు చేశామని చెప్పారు. యువతకు ఉపాధి కోసం పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు.
మెట్ల బావిని సందర్శించిన ఎమ్మెల్యే..
శివనగర్లోని మెట్ల బావిని ఎమ్మెల్యే నరేందర్ సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న మెట్ల బావికి గతంలోనే మరమ్మతులు చేశామన్నారు. మరిన్ని నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలోని కాకతీయుల నాటి కట్టడాల ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే చెప్పేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీశ్, మహిళా అధ్యక్షురాలు గోగుల ఇందిర తదితరులు పాల్గొన్నారు.