ఎన్నికల సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. డప్పుచప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలు, జై బీఆర్ఎస్ నినాదాలతో ఊరూవాడ హోరెత్తుతోంది. ఉదయం నుంచి పొద్దుపోయేవరకు ఒక్కో అభ్యర్థి సుమారు 15 గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్ల వేటలో బిజీబిజీ అవుతున్నారు. సోమవారం భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, మహబూబాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. పేదలకు అండగా ఉండే బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఖానాపురం మండలంలోని కొత్తూరు, రంగాపురం, రాగంపేట, ధర్మరావుపేట, బాలుతండా, మర్మాగిబోడుతండా, భద్రుతండా, కొడ్తిమాట్తండా, గొల్లగూడెంతండా, బోటిమీదితండా, నాజీతండా, వేపచెట్టుతండా, మంగళవారిపేట, బుధరావుపేట గ్రామాల్లో నర్సంపేట అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలుకరిస్తూ ఓటు అభ్యర్థించారు.
పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు తొర్రూరు ముస్లింలు మద్దతు తెలిపారు. ఆయన గెలుపు కోసం తామంతా కలిసికట్టుగా కృషిచేస్తామని వారు ప్రకటించారు. అంతకుముందు స్థానిక జామా మసీద్లో ఎర్రబెల్లితో కలిసి పట్టణ, మండల ముస్లింలు దువా చేశారు.
భూపాలపల్లి మండలం కొత్తపెల్లి(ఎస్ఎం), చిట్యాల మండలంలోని దూత్పల్లి, లక్ష్మిపూర్తండా, ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపూర్ గ్రామాల్లో నాయకులతో కలిసి భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ప్రచారం చేశారు. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు పట్టంకట్టాలని ప్రజలను కోరారు.
గీసుగొండ మండలం, సంగెం మండలంలోని తిమ్మాపురం, గాంధీనగర్, కొత్తగూడెం గ్రామాల్లో పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలన్నారు.
మహబూబాబాద్ మండలంలోని బలరాంతండా, అమనగల్, గుండాల గడ్డతండా, సింగారం, అయోధ్య, ముడుపుగల్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్ విస్తృత ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే తండాలు గ్రామ పంచాయతీలుగా మారి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు ఆలోచన చేసి నిరుపేదలకు అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.