కోటి ఆశలు, కొంగొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరాదిని స్వాగతించిన ప్రజలు సోమవారం న్యూ ఇయర్ వేడుకలను అంబరాన్నంటేలా సంబురంగా జరుపుకొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని ఇళ్లల్లో, కాలనీల్లో చిన్నాపెద్దా అంతాకలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకొన్నారు. ఇళ్ల ముందువేసిన తీరొక్క రంగవల్లులు ఆకట్టుకున్నాయి. దీంతో ఎక్కడచూసినా నయాజోష్ కనిపించింది. కొత్త ఏడాది అంతా శుభం కలగాలని ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు కిటకిటలాడగా భద్రకాళీ, వేయిస్తంభాల గుడి, కాళేశ్వరం, రామప్ప ఆలయాల్లో ఉదయం నుంచే దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. దివ్య తేజస్సుతో ఉన్న భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని తరించారు. అలాగే చిన్నారుల ఆటపాటలతో కాకతీయ జూ పార్కు సహా పలు పార్కులు కళకళలాడాయి. అటు క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు సందడిగా కనిపించాయి.