హనుమకొండ, మే 2: లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ సుధీర్ కుమార్ను గెలి పించేందుకు న్యాయవాదులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి జనార్దన్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా అనేక ఏళ్లుగా సేవలు అందిస్తున్న న్యాయవాదులకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల నూతన లీగల్ సెల్ కమిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కమిటీ సిఫారసుల మేరకే ఎవరికైనా పదవులు, బాధ్యతలను అప్పగిస్తామన్నారు. పార్టీకి కష్ట కాలంలో అండగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన న్యాయవాదులకు దాస్యం కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్కుమార్ మాట్లాడు తూ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేస్తుందని అన్నారు.
అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని, పార్టీని కాపాడుకునేందుకు లీగల్ సెల్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను తుంగలో తొకి మోసం చేస్తుందన్నారు. ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా క్రిమినల్ కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలే ప్రజాసేవకు దగ్గరి మార్గంగా భావించి రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన తన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించి తనకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్ రాజు, సీనియర్ న్యాయవాదులు వద్దిరాజు గణేశ్, సోమేశ్వరరావు, శ్యాంసుందర్ రావు, అబ్దుల్ నబీ, రంజిత్ కుమార్, వసంత్ కుమార్, బసవరాజు, మహేశ్ పటేల్, శ్రీనివాసరావు, అరుణ, ఉషశ్రీ పాల్గొన్నారు.