వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గాల కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం కేసీఆర్ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా లాంఛనంగా సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్లలోపున్న వారిని అర్హులుగా నిబంధనలు రూపొందించారు. ఇప్పటికే ఈ పథకంలో జిల్లాలోని 12 మండలాల్లో 2,350 మంది చేనేత కార్మికులను గుర్తించారు. ఆన్లైన్లో వారి వివరాలను సైతం నమోదు చేయించారు. మరోవైపు ‘చేనేత మిత్ర’లో నూలు కొనుగోలుకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న సర్కారు టెక్స్టైల్ పార్క్లతో పాటు అనుబంధ రంగమైన గార్మెంట్ అభివృద్ధికి చేయూతనిస్తున్నది.
జనగామ చౌరస్తా, ఆగస్టు 24 : నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బీమా’ మాదిరిగానే ‘నేతన్న బీమా’ పథకం ప్రవేశపెట్టింది. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఇటీవలె ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఎవరైనా చేనేత, మరమగ్గాల కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించి ఆదుకోనుంది. ‘నేతన్నకు చేయూత పథకం’ (త్రిఫ్టు)లో సభ్యులుగా ఉన్న కార్మికులే నేతన్న చేనేత బీమా పథకానికి అర్హులు. 18 నుంచి 59 ఏండ్ల వయసులోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. చేనేత వృత్తినే ఉపాధిగా చేసుకొని అనేక మంది కార్మికులు జిల్లాలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చేనేత బీమాకు జిల్లా వ్యాప్తంగా 2,350 మంది అర్హులను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. నేతన్నకు చేయూత పథకం (త్రిఫ్టు)లో సభ్యత్వం లేని వారిని, సభ్యత్వం ఉండి 60 ఏండ్లు పైబడిన వారిని సుమారుగా మొత్తం 430 మందిని అనర్హులుగా గుర్తించినట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ పథకంతో చేనేత పారిశ్రామిక కుటుంబాలకు భరోసా లభిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. నాటి సీమాంధ్ర పాలకుల పాలనలో కుదేలైన వస్త్ర పరిశ్రమకు నేటి స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్, చేనేత జౌళి శాఖమంత్రి కేటీఆర్ చొరవతో జీవం పోసింది. నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించింది. పాత మరమగ్గాలను పూర్తి సబ్సిడీతో ఆధునీకరించేలా యజమానులు, ఆసాములను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నేతన్నలు నెలనెలా సంపాదించిన కూలి డబ్బులు వృథా కాకుండా ‘త్రిఫ్టు’ పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకంలో కార్మికుడు 8 శాతం బ్యాంకులో జమ చేస్తే, మరో 8 శాతం ప్రభుత్వం కలిపి మొత్తం 16 శాతం నిధులను నేతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నది. కరోనా సమయంలో జమ చేసి న నిధులు చేనేత కార్మికులకు ఆసరా అయ్యాయి. ‘చేనేత మిత్ర’ పథకం కింద 40 శాతం నూలు సబ్సిడీ ఇస్తున్నది. టెక్స్టైల్ పార్క్లతో పాటు అనుబంధ రంగమైన గార్మెం ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాయి తీలు కల్పిస్తున్నది.
జిల్లాలో 2,350 మందిని గుర్తించాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘నేతన్నకు బీమా’ పథకానికి జిల్లాలోని 12 మండలాల్లో 2,350 మంది చేనేత, మరమగ్గాల కార్మికులను అర్హులుగా గుర్తించాం. వీరి పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. ‘త్రిఫ్టు’ పథకంలో సభ్యులుగా ఉన్న వారితో పాటు, 18-59 ఏండ్ల వయసులోపు ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం. త్రిఫ్టు పథకంలో సభ్యత్వం ఉండి 60 ఏండ్లు పైబడిన వారిని అనర్హులుగా గుర్తిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా సుమారు 430 మంది అనర్హులు ఉన్నట్లు తేలింది.
– కల్యాణి, ఏడీ, చేనేత జౌళి శాఖ, జనగామ
మానవత్వానికి మారుపేరు సీఎం కేసీఆర్..
మానవత్వానికి మారుపేరు సీఎం కేసీఆర్. చేనేత కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదంలో లేదా సహజ మరణం చెందినా మృతుడి కుటుంబం రోడ్డునపడొద్దని చేయూతనిస్తున్నారు. కేసీఆర్ సార్ ‘నేతన్న బీమా’ పథకం తీసుకొచ్చిండు. ఇది మాకు సంతోషం కలిగించే విషయం. సీమాంధ్రుల పాలనలో చేనేత కార్మికులు ఆకలి చావులతో అనేక మంది మరణించారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించారు. అన్ని విధాలుగా సాయం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారు.
– వేముల బాలరాజు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు