హనుమకొండ, జూన్ 11 : జిల్లా కేంద్రంలో ఆదివారం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లాలో 11 రూట్లలో 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 21,036 అభ్యర్థులకు గాను 13,929 మంది(66.22 శాతం) హాజరు కాగా, 7,107 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషన్ హైస్కూల్, హనుమకొండ కేడీసీ కళాశాల, నయీంనగర్లోని వాగ్దేవి కళాశాలలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, సిబ్బంది హాజరుపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాలను కలియ తిరిగి, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించి, ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు ఇచ్చారు. అదే విధంగా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాల, కడిపికొండలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, మడికొండలోని రామన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.