నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/నల్లబెల్లి/ఖానాపురం: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లాలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లోని గృహలక్ష్మి లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్లకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గృహలక్ష్మీ పథకంలో భాగంగా అర్హులైన చాలా మంది నూతన ఇంటి నిర్మాణాలు చేపట్టారన్నారు. కొందరివి పిల్లర్లు, మరికొందరివి స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయని తెలిపారు. వాటి బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించి బిల్లులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
చెన్నారావుపేట మండలంలోని 31 గ్రామాల్లో గృహలక్ష్మీ పథకం కింద ఇల్లు నిర్మాణం ప్రారంభించిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వం వెంటనే బిల్లు చెలించి ఆదుకోవాలని తహసీల్దార్ ఫణికుమార్కు వినతి పత్రం అందజేశారు. అలాగే నర్సంపేట మండల తహసీల్ కార్యాలయంలో వందలాది గృహలక్ష్మీ పథక లబ్ధిదారులు ధర్నా చేసి తహసీల్దార్ విశ్వప్రసాద్కు వినతిపత్రం అందించారు. నల్లబెల్లి మండలంలో మంజూరైన 328 మంది నిరుపేదలకు గృహలక్ష్మీ పథకం కింద ఇండ్లకు సంబంధించి బిల్లులు చెల్లించాలని తెలంగాణ ఉద్యమకారుడు బట్టు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు తహసీల్దార్ రాజేశ్కు లబ్ధిదారులందరూ కలిసి వినతిపత్రం అందజేశారు. ఖానాపురం తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంపీడీఓ సుమనా వాణిలకు వినతిపత్రం ఇచ్చారు.