వరంగల్, మే 18 : నగరంలో వర్షకాలంలో చేపట్టాల్సిన పనులపై గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. వరద ముంపు నివారణలో భాగంగా నగరంలోని 34 నాలాల పూడికతీత పనులను చేపట్టారు. ఈ నెల చివరి నాటికి నాలాల పూడికతీత పనులను పూర్తి చేయాలని సిబ్బందికి అధికారులు ఆదేశించారు. దీనికి తోడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. వర్షకాలంలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సెల్లార్లలో విద్యుత్ ప్యానెల్ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ యాజమాన్యాలకు ముందస్తుగా నోటీసులు ఇస్తున్నారు. విద్యుత్ ప్యానెల్లను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బల్దియా అధికారులు వర్షకాలంలో చేపట్టాల్సిన అన్ని చర్యలపై ముందస్తుగానే సిద్ధమవుతున్నారు.
వారం రోజుల్లో పూడికతీత పూర్తి
గ్రేటర్ పరిధిలోని నాలాల పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారించారు. గ్రేటర్లోని సుమారు 34 నాలాల పూడికతీత పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన నాలాలైన బొంది వాగు, 12 మోరీలు, అలంకార్ బ్రిడ్జి, నయీంనగర్ నాలాల పనులు దాదాపుగా పూర్తి చేశారు. దీనితో పాటు గ్రేటర్లోని నాలాల పూడికతీత పనులను మరో వారం రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నారు.
అపార్ట్మెంట్లకు నోటీసులు
వర్షకాలంలో ప్రాణనష్టం జరుగకుండా ముందస్తుగానే అపార్ట్మెంట్లో చేపట్టాల్సిన చర్యలపై గ్రేటర్ అధికారులు దృష్టిసారించారు. వర్షకాలంలో అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ల సెల్లార్లలోకి వర్షం నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సెల్లార్లో ఉన్న విద్యుత్ ప్యానెల్స్ను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు. సెల్లార్లలో విద్యుత్ ప్యానెల్స్ ఉన్న పలు అపార్ట్మెంట్లకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. వర్షకాలం సమయానికి ప్యానెళ్లను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 134 సెల్లార్లలో విద్యుత్ ప్యానెల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 42 ప్యానెళ్లను మొదటి అంతస్తులోకి మార్చుకున్నారు. ఇంకా మార్చుకోని 92 అపార్ట్మెంట్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలను కూడా గ్రేటర్ అధికారులు గుర్తించారు. వాటి యజమానులకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు.