కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూర్చగా, ఇప్పటికే పదిహేనింటి నిర్మాణం పూర్తయింది. కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూర్చగా, ఇప్పటికే పదిహేనింటి నిర్మాణం పూర్తయింది. నిర్మాణ పనులను పీఆర్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగాలు పర్యవేక్షిస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలోపు అన్నింటిని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
వరంగల్, అక్టోబర్ 19(నమస్తేతెలంగాణ) : పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఊరూరా నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మించింది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ లేదా ట్రాలీ ఆటోను కేటాయించింది. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది కొరత తీర్చింది. నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు ఇస్తున్నది. వెరసి పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. అభివృద్ధిలో ప్రతి గ్రామం పోటీపడుతున్నది. ఏటా పలు గ్రామాలు ఉత్తమ పంచాయతీలుగా జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకొంటున్నాయి. ఈ క్రమంలో కొత్త పంచాయతీలతో పాటు కార్యాలయ భవనాలు శిథిలావస్థలో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కో గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నది. ప్రతి భవనాన్ని 976 చదరపు అడుగులతో నిర్మిస్తున్నది. సర్పంచ్, కార్యదర్శికి ఒక్కో గది, స్టోర్ రూం, మీటింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్ ఉండేలా ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు డిజైన్ చేశారు.
వరంగల్ జిల్లాలో 192 గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.38.40 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.26.60 కోట్లతో 133 భవనాల నిర్మాణానికి పంచాయతీరాజ్, రూ.11.80 కోట్లతో 59 భవనాల నిర్మాణానికి గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. టెండర్లు ఖరారైన తర్వాత ఆయా గ్రామాల్లో భవనాల నిర్మాణం చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన 133 భవనాల్లో మండలం వారీగా చెన్నారావుపేటలో 6, దుగ్గొండిలో 14, గీసుగొండలో 12, ఖానాపురంలో 5, నల్లబెల్లిలో 14, నర్సంపేటలో 9, నెక్కొండలో 17, పర్వతగిరిలో 19, రాయపర్తిలో 15, సంగెంలో 13, వర్ధన్నపేటలో 9 ఉన్నట్లు ఇంజినీర్లు వెల్లడించారు. 192 గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల్లో పదిహేనింటి నిర్మాణం పూర్తయింది. సంగెం మండలంలోని వెంకటాపురం హవేలి, కాపులకనపర్తి, గవిచర్ల, నర్సానగర్, గీసుగొండ మండలంలోని అనంతారం, ఎలుకుర్తి, హర్జ్యాతండా, నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లె, పర్వతగిరి మండలం మూడెత్తులతండా, అనంతారం, దూపతండా గ్రామాల్లో భవనాల నిర్మాణం పూర్తయినట్లు పీఆర్ కార్యనిర్వాహక ఇంజినీర్ శంకరయ్య వెల్లడించారు. తమ విభాగం చేపట్టిన వాటిలో నెక్కొండ, సంగెం, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లోని లావుడ్యానాయక్తండా, బాలునాయక్తండా, మేడపల్లి, ఖల్నాయక్తండా గ్రామాల పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయిందని గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ హైమవతి చెప్పారు.
గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాల నిర్మాణాన్ని జనవరి నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీ భవనాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రావీణ్య భవనాల నిర్మాణంపై ఇంజినీరింగ్ విభాగాల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షిస్తున్న అన్ని భవనాల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఈఈ హైమవతి పేర్కొన్నారు. తమ విభాగం పర్యవేక్షిస్తున్న భవనాలన్నింటిని కూడా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పీఆర్ ఈఈ శంకరయ్య తెలిపారు.