హనుమకొండ, మే 22 : ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోఅదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ధాన్యం కొనుగోలుపై డీఆర్డీఏ, డీసీవో, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తప్పకుండా తూర్పార పట్టి, క్లీనింగ్ చేసిన తర్వాతే టోకెన్లు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఏఈవోలను ఆదేశించారు. సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లను ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా మిల్లులకు చేరవేయాలన్నారు. రైస్మిల్లర్లు తరుగు తీస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీసీవో నాగేశ్వర్ రావు, డీసీఎస్వో వసంతలక్ష్మి, మారెటింగ్ అధికారి సురేఖ, వ్యవసాయ శాఖ ఏడీ దామోదర్రెడ్డి, డీటీ సీఎస్లు సత్యనారాయణ, రమేశ్, కృష్ణ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ లైఫ్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒకరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టి, విజేతలకు జూన్ 5న మిషన్ లైఫ్ ఉత్సవాల్లో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సాంబశివరావు, ఇండస్ట్రీస్ జీఎం హరిప్రసాద్, డీపీవో జగదీశ్వర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 87 దరఖాస్తులు..
హనుమకొండ : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 87 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశం మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను విన్న కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, గ్రీవెన్స్కు వచ్చిన దరఖాస్తుల్లో 30 వరకు రెవెన్యూ, భూములకు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీపీవో సత్యనారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, మైనింగ్ ఏడీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
బిల్లులు ఇప్పించాలని సర్పంచ్ల వినతి
కమలాపూర్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో పనులు పూర్తి చేసిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కట్కూరి విజయ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.