వరంగల్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది. ఓటరు నమోదు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ల నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 2023 నవంబర్ 1 క్వాలిఫైయింగ్ తేదీగా ప్రకటించింది. ఈ తేదీకి మూడేండ్ల ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఓటరుగా అవకాశముంటుంది. ప్రతి ఒక్కరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రచారం చేయాలని ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనుండగా ఓటరు నమోదు, జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ వీరి పరిధిలోనే జరుగనుంది.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం మొదటి నుంచీ బీఆర్ఎస్కు బలమైన స్థానంగా ఉంది. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్కుమార్ గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. 2009లో ఉప ఎన్నిక జరుగగా బీఆర్ఎస్ విజయం సాధించింది. పదవీ కాలం పూర్తి కావడంతో 2015 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఘన విజయం సాధించారు. 2021లో జరిగిన ఎన్నికల్లోనూ పల్లా రాజేశ్వర్రెడ్డి రెండోసారి గెలిచారు.
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హకు కోసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం హనుమకొండ కలెక్టరేట్లో ఆమె సమావేశం నిర్వహించారు. 2023 నవంబర్ 1కి మూడేండ్ల ముందు డిగ్రీ, డిప్లొమా, తత్సమాన విద్యార్హత కలిగిఉన్న గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వామోదిత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తు పత్రంతోపాటు డిగ్రీ, డిప్లొమా, తత్సమాన విద్యార్హతల పత్రాలను సమర్పించాలన్నారు. ఏ మండలానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర వివరాలు, సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు పత్రాన్ని నాయబ్ తహసీల్దార్కు అందజేయాలని చెప్పారు. ఆన్లైన్లోనూ దరఖాస్తు ఫారాలు తీసుకోవడంతో పాటు, దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్లయిన ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్రావు(కాంగ్రెస్), రావు అమరేందర్ రెడ్డి (బీజేపీ), ఎం.మణి (బీఎస్పీ), గొడుగు వెంకట్ (సీపీఎం), సయ్యద్ ఫైజుల్లా (ఎఐఎంఐఎం), శ్యామ్ సుందర్ (టీడీపీ), రజినీకాంత్ (వైఎస్సార్సీపీ) పాల్గొన్నారు.