వరంగల్, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో కేంద్రాలకు బయల్దేరారు. సెగ్మెంట్ పరిధిలో మొత్తం 695 కేంద్రాలు ఉండగా, పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను తొలుత జిల్లాకేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ సెంటర్లకు తీసుకొచ్చి అక్కడినుంచి నల్లగొండలోని స్ట్రాంగ్రూమ్స్కు తరలిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప ఎన్నికలో మొత్తం 52మంది బరిలో ఉండగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ తరపున గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ తరపున చింతపండు నవీన్ పోటీలో ఉన్నారు.
గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక ప్రచార సరళి గతంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపించింది. అసెంబ్లీ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఎన్నిక జరుగనుండడం.. ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023 నవంబర్ 1కి మూడేండ్ల ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటు వేసే అవకాశం కల్పించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు వీలుగా 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి తిరిగి ఏర్పడినప్పటి నుంచి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్కు జరిగిన ప్రతి సాధారణ ఎన్నికలో, ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని తిరిగి ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా అదే ఏడాది వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన సాధారణ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్కుమార్ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 2008లో పదవులకు రాజీనామా చేశారు. ఇలా ఖాళీ అయిన క్రమంలో 2009లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్కుమార్ రెండోసారి గెలిచారు. అలాగే 2015 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచారు. పదవీకాలం ముగియడంతో 2021 ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సాధారణ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలోనూ పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు.
పల్లా రాజేశ్వర్రెడ్డి గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంలో ఆనవాయితీ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నది.