హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12 : వరంగల్ నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గీతాజయంతి వారోత్సవాలను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయం నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామచంద్రస్వామి శోభాయాత్ర(రథయాత్ర)ను చీఫ్విప్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో అనేక ఒత్తిళ్లు, సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆధ్యాత్మిక ప్రవచనాలతో కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు దేవుడి అనుగ్రహం ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ నెల 16న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో 10 వేల జంటలతో గణపతి సచ్చిదానందస్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించే అనఘాష్టమి వ్రతంలో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వేయిస్తంభాల గుడి అర్చకుడు గంగు మణికంఠ శర్మ, కూకట్పల్లి ఇస్కాన్ ప్రెసిడెంట్ నర్సింహస్వామి, ఇస్కాన్ సిబ్బంది పాల్గొన్నారు.
హనుమకొండ : సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో : ఈ నెల 16న నిర్వహించనున్న అనఘాష్టమి వ్రతం ఏర్పాట్లను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనఘాష్టమి వ్రతంతోపాటు 17న నిర్వహించే గీతాపారాయణం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు.