హనుమకొండ, మే 1: మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని జయశంకర్ పార్కులో, లష్కర్బజార్లో చీప్విప్ మేడే జెండా ఎగురవేయగా, కార్మికుల అడ్డా కేంద్రాల్లో కార్మిక సంఘం నాయకులు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్టాడుతూ ముందుకు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకులు సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే రూ.6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లిస్తున్నారన్నారు.
2014 నుంచి 2023 వరకు మరణించిన 4,001 బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ. 5 లక్షల చొప్పున, వైకల్యానికి గురైన 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లను నేటివరకు చెల్లించినట్లు తెలిపారు. అలాగే కార్మిక కుటుంబంలోని ఇద్దరు మహిళా కార్మికులు, వారి ఇద్దరు పిల్లల పెండ్లికి ఒకరికి రూ. 30వేల చొప్పున ‘వివాహ బహుమతి’ని రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 46,638 మంది లబ్ధ్దిదారులకు రూ. 130 కోట్లు చెల్లించిందన్నారు. కార్మికులు ఏకారణం చేతనైనా మరణిస్తే రూ. లక్ష మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు మరణించిన 35,796 మంది కార్మికులకు రూ. 288 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన పోరాటంపై జరిపిన కాల్పులలో అమరువీరుల నెత్తుటి జెండానే మేడే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లేబర్ కార్డ్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అసంఘటిత కార్మికులకు దోహదపడుతుందన్నారు. పోరాడి సాధించుకున్న హకులను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, కార్మికులకు వ్యతిరేకమైన కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. కార్మిక సంఘాలలో కులమత చిచ్చులు పెట్టి కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి మే 1వ తేదీ నుంచి 31 వరకు జరిగే కార్మిక సంక్షేమ మాసోత్సవంలో అందరూ పాల్గొని బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ మహోత్సవ కోఆర్డినేటర్ పుల్ల శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.