హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 4 : దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మాది చేతల ప్రభుత్వమని బీజేపీది మాటల ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చిల్లర రాజకీయం చేస్తుందని, మోదీ తెలంగాణ ప్రజలని కించపరిచేలా విధంగా మాట్లాడున్నాడని అన్నారు. మేం గాంధీని పూజిస్తుంటే.. బీజేపీ వాళ్లు గాడ్సేని పూజిస్తున్నారని మండిపడ్డారు. మాకు బీజేపీతో పనిలేదు, ఎన్డీయేలో చేరాల్సిన అవసరం అసలే లేదన్నారు. మోదీకి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇతర రాష్ర్టాలకు తరలించారన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒడిపోతారన్నారు. ఈ నెల 6న ఉదయం 9 గంటలకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరానికి వస్తున్నారన్నారు. రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కృషితోరజకుల కోసం రూ.4కోట్లతో మోడ్రన్ లాండ్రోమార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలోనే మొదటి సారి ఏర్పాటు చేసిన దీన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. దీన్ని రజక సొసైటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భద్రకాళి బండ్పై సస్పెన్షన్ బ్రిడ్జి, మహిళలకు భరోసా కల్పిస్తున్న పోలీస్ భరోసా సెంటర్, వరంగల్ రీజినల్ లైబ్రరీలో డిజిటల్ ల్రైబరీ, అలంకార్ సమీపంలోని మున్నూరుకాపు సంఘం భవన్ శంకుస్థాన, జంక్షన్ అభివృద్ధి, హనుమకొండ బస్స్టేషన్ను ఆధునీకరించేందుకు రూ.70 కోట్లతో పనులకు శంకుస్థాపన, హనుమకొండలోని లష్కర్బజార్ ఇంగ్లిష్మీడియం ప్రైమరీ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని వివరించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద వరంగల్ నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
విద్య, వైద్య, ఐటీ హబ్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మడికొండలోని అనేక ఐటీ కంపెనీలు రాగా ఇంకా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హనుమకొండ బాలసముద్రంలోని స్కౌంట్స్ అండ్ గైడ్స్ సమీపంలో ఐటీ టవర్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.26 కోట్లతో బంధం చెరువు, రూ.30 కోట్లతో నిట్ సమీపంలోని జంక్షన్ల అభివృద్ధి, వడ్డేపల్లి నుంచి గోపాల్పూర్ వంద ఫీట్ల రోడ్డు రూ.13కోట్లతో, రూ.7 కోట్లతో హనుమకొండలో ఆర్ అండ్ బీ గెస్ట్ పనులను మంత్రి ప్రారంభించనున్నట్లు చెప్పారు. పద్మాక్షీరోడ్డులో కేసీఆర్ భవన్ రూ.6 కోట్లతో, అలాగే, రూ.1 కోటితో లాండ్రోమార్ట్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం హనుమకొండలోని కుడా(హయగ్రీవాచారి) మైదానంలో కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్పై మోదీ వ్యాఖ్యలు సరికావన్నారు. దేశ ప్రజలంతా రాష్ట్రం వైపు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9న పరకాలకు మంత్రి కేటీఆర్ రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి, ఎంఎల్సి బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయాలి
కుడా గ్రౌండ్స్లో ఈ నెల 6న ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రతి డివిజన్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని చీఫ్ విప్ వినయ్ భాసర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ విసృ్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కేటీఆర్ రానున్న నేపథ్యంలో 50 వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో సుమారు రూ.900 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఆ సభను పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.