వరంగల్ చౌరస్తా, జూలై 19 : పుట్టుకతోనే వినికిడి లోపం గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం హైదరాబాద్లో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ట్రస్ట్ సీఈవో విశాలాక్షి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్రెడ్డితో మంత్రి హరీశ్రావు నిర్వహించిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో మాత్రమే నిర్వహిస్తున్న ఈ శస్త్రచికిత్సలను త్వరలోనే ఇక్కడ సైతం నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
వైద్యసేవల విస్తరణకు మరిన్ని చర్యలు..
– డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్
వరంగల్ను హెల్త్ హబ్గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఎంజీఎం హాస్పిటల్లో వైద్యసేవల విస్తరణ జరుగుతున్నది. అందులో భాగంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జీరీలు నిర్వహించడానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమావేశం తీర్మానం చేసింది. ఇప్పటికే వృద్ధులు, హిజ్రాలకు ప్రత్యేక క్లినిక్లు, ఈవినింగ్ ఓపీ సేవలతో పాటు అత్యవసర విభాగం యూనిట్ను ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం సహకారంతో మరిన్ని వైద్యసేవలను విస్తరిస్తాం.
చిన్నారులకు వరం..
– డాక్టర్ పరశురాం, ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి
శబ్ధాలను వినడం ద్వారా తిరిగి స్పందించే ప్రయత్నంగా చిన్నారులు మాట్లాడడం చేర్చుకుంటారు. వినికిడి లోపం కారణంగా చిన్నారులు తిరిగి మాట్లాడలేక మూగవారిగా మారిపోతారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్న ఏకైకమార్గం కాక్లియర్ ఇంప్లాంట్ మాత్రమే. ఈ శస్త్రచికిత్స రెండు సంవత్సరాల్లోపు చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నది. అనంతరం స్పీచ్ థెరపీ ద్వారా ఎక్కువశాతం మంది చిన్నారులు వారి సమస్యను అధిగమించి, కొత్త జీవితాలను పొందుతున్నారు. త్వరలోనే ఎంజీఎంలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.