ములుగురూరల్, జనవరి 30 : ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టమ్మ వద్ద తాత్కాలిక దుకాణాల ఏర్పాటు, ఇతర అంశాలపై జాకారం జీపీ పాలకవర్గ సభ్యులతో పాటు పూజారులతో తన కార్యాలయంలో ఆర్డీవో సత్యపాల్రెడ్డి, డీఎల్పీవో స్వరూపారాణి, ఇతర అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ మాట్లాడుతూ సమావేశానికి దేవాదాయ శాఖ తరపున హాజరైన అధికారి రాజేందర్ 2014లోనే గట్టమ్మ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిందని తెలిపారన్నారు.
అప్పటి నుంచి తమ శాఖ ఆధీనంలోకి పూర్తిగా గట్టమ్మ రాలేదని పేర్కొని ఇప్పుడు తమ శాఖలోకి పూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను చూపించారని తెలిపారు. జాతర నిర్వహణలో భాగంగా దేవాదాయ శాఖతో పాటు గట్టమ్మ పూజారులతో కలిసి తాత్కాలిక దుకాణాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2014 నుంచి జరిగిన జాతరల సందర్భంగా వచ్చిన ఆదాయం రెవెన్యూ శాఖ వద్ద ఉందని, దానిని సైతం దేవాదాయ శాఖ ద్వారా స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారని ఆయన చెప్పారు.