హనుమకొండ సుబేదారి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్నదాతలను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో నకిలీ పురుగు మందులను(Fake pesticides )విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. ముఠా నుంచి సుమారు 34 లక్షల రూపాయల విలువ ఉన్న వివిధ కంపెనీల పేర్ల కలిగి వున్న నకిలీ పురుగు మందులతో పాటు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు నకిలీ పురుగు మందు లేబుల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితులను సీపీ అంబర్ కిషోర్ ఝా వివరాలు వెల్లడించారు.
రెండు రోజుల క్రితం టాస్క్ ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానస్పదంగా తిరుగుతున్న కారును తనీఖీ చేశారు. కారులో పురుగు మందల డబ్బాలను గుర్తించారు. నిందితుల్లో ఒకరైనా బళ్లారికి చెందిన కాట్రగౌడ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ చేపట్టారు.
నిందితుడు భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని చర్లపల్లి ప్రాంతంలోని గోడౌన్ పై దాడి చేసి మిగతా నలుగురు హైదరాబాద్ కు చెందిన నగమోకడి రంగారావు, ముద్దంగుల ఆదిత్య, పిట్ట నవీన్, శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వాహనాలతో పాటు మరో నాలుగు కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు, గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.