రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నది. ఎప్పటికప్పుడు సాగులో సమస్యల పరిష్కారం, అధునాతన పద్ధతులు అన్నదాతలకు అందించాలనే ఉద్దేశంతో రైతువేదికలను నిర్మించింది. ప్రస్తుతం వీటి నిర్వహణకు నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో వేదికకు నెలనెలా రూ.9 వేలు కేటాయిస్తున్నది. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు ఐదు నెలలకు గాను ఒకేసారి రూ.45 వేలు విడుదల చేసింది. దీంతో రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
వరంగల్, డిసెంబర్ 21(నమస్తేతెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్నది. రైతన్న సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. దేశంలో మరెక్కడా లేని రీతిలో అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు ఇస్తున్నది. వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించేందుకు పంట పెట్టుబడి కోసం రైతులకు ఏటా రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ఎరువులు, విత్తనాల కొరత తీర్చింది. సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలను సరఫరా చేస్తున్నది.
ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్ను గుర్తించి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ని నియమించింది. ఏటా రెండు పంటల ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. అసంఘటిత రైతులు ఒకచోట కూర్చుని పంటల సాగు, మార్కెట్ అంశాలపై చర్చించుకోవడానికి ప్రతి క్లస్టర్ పరిధిలో ఒక రైతు వేదిక నిర్మించింది. ఆయా క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు ఈ రైతువేదికల్లో వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధునాతన పద్ధతులు, పంటల సాగులో మెళకువలను తెలియజేస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వివరిస్తున్నారు. రైతుబంధు వంటి పథకాల అమల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ వేదికల ద్వారే పరిష్కరిస్తున్నారు.
ఉద్యానశాఖ అధికారులూ ఆయిల్పాం, కాయగూరల సాగుపై ఇక్కడే అవగాహన సదస్సులు జరుపుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. పంటలకు చీడపీడలు ఆశిస్తే ఏఈవో, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇలా సీఎం కేసీఆర్ చెప్పినట్లు వ్యవసాయరంగంలో రైతువేదికలు కీలకంగా మారాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్వహణపై నజర్ పెట్టింది. నెలనెలా రూ.9 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు నిర్ణయించింది. గత ఏప్రిల్ నుంచి రైతువేదికలకు నిర్వహణ నిధులు కేటాయిస్తున్నది.
జిల్లాలో మొత్తం 59..
జిల్లాలో 59 క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్లో ప్రభుత్వం రూ.22 లక్షలతో ఒక రైతువేదిక భవనం నిర్మించింది. ఏఈవోకు ఒక గది, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్కు ఒక గదితో పాటు రైతుల సమావేశం కోసం హాలు ఉండేలా డిజైన్ చేసింది. ప్రతి వేదికకు 125 ప్లాస్టిక్ కుర్చీలు, బీరువా, ఏఈవో, కో ఆర్డినేటర్ గదుల్లో ఒక్కో టేబుల్, ఎస్ టైప్ కుర్చీలు, మైకు సిస్టం సమకూర్చింది. కరంటు బిల్లు కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రైతువేదికకు నెలకు రూ.2 వేల చొప్పున రూ.24వేలు ఇచ్చింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీటి నిర్వహణకు నిధులను పెంచింది.
విద్యుత్ ఛార్జీలు రూ.1,000, తాగునీటికి రూ.500, ఊడ్చేవారికి వేతనం రూ.3,000, స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులు రూ.1,000, రైతు శిక్షణ శిబిరాలకు రూ.2,500, శానిటరీ, మినీ లైబ్రరీ, మరమ్మతులు తదితరాల కోసం రూ.1,000 చొప్పున మొత్తం రూ.9 వేలు ఇచ్చేందుకు నిర్ణయించింది. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు ఐదు నెలలకు సంబంధించి రూ.45 వేలు విడుదల చేసింది. దీంతో 59 రైతు వేదికలకు తొలి విడుత నిర్వహణ నిధులు రూ.26.55 లక్షలు వచ్చాయి. సంవత్సరానికి రూ.1.08 లక్షలు ప్రభుత్వం నుంచి రావడం వల్ల రైతువేదికల నిర్వహణ సులువు కానుంది. దీంతో రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్వీపింగ్, తాగునీరు, శానిటేషన్ నిర్వహణతో పాటు విద్యుత్ చార్జీల చెల్లింపుల వంటి సమస్యలకు చెక్ పడినట్లేనని వ్యవసాయశాఖ అధికారులు సంతోషం వెలిబుచ్చుతున్నారు.