వేలేరు, జనవరి 30 : అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో మండల సభకు హాజరుకావాలని, క్రమశిక్షణతో పని చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వేలేరు రైతు వేదిక భవనంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి అధ్యక్షతన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి పల్లెప్రగతి అనే బృహత్తరమైన కార్యక్రమం అమలు చేసిందన్నారు. దీంతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి సాధించాయని చెప్పారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తానని సర్పంచ్లకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ రూ.104కోట్లతో ప్రారంభించిన సాగునీటి పనులను త్వరగా పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. వేలేరులో మండల కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. హనుమకొండ నుంచి వేలేరు మీదుగా జనగామ వరకు డబుల్ రోడ్డు వేయించాలనే కోరిక ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజురు చేసేలా లేదన్నారు. రాష్ట్ర ఆదాయానికి మించి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలోనే జాప్యం చేస్తున్నదని, ఇంకా కొత్త పనులను చేపట్టే అవకాశం లేదని విమర్శించారు.
కాగా, పూర్తి సమాచారం లేకుండా హాజరైన విద్య, వైద్య శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లికుదుర్ల శివారులో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని జడ్పీటీసీ చాడ సరితారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, మైనింగ్ పర్మిషన్ ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. మట్టిని తరలించే వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కేజీవీల్స్తో ట్రాక్టర్లు రోడ్లపై వెళ్లకుండా జీపీల్లో తీర్మానాలు చేయాలని సర్పంచ్లకు చెప్పారు. అంతకుమందు పీచరలోని సమ్మక్క-సారలమ్మల తల్లులను దర్శించుకుని జాతర ఏర్పాట్లు ఘనంగా చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, వైస్ఎంపీపీ సంపత్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, మండలాధ్యక్షుడు నర్సింహారావు, పీచర జాతర కమిటీ చైర్మన్ మహేందర్, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ కొమి, ఎంపీవో విమల పాల్గొన్నారు.